టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ను ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ మరోసారి బోల్తాకొట్టించాడు. గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో రెండో బంతికే పెవిలియన్కు చేర్చాడు. తొలి బంతి ఔట్ సైడ్ ఎడ్జ్ తీసుకుని ఫోర్త్ స్లిప్-గల్లీ నుంచి బౌండరీ వెళ్లింది. అయితే రెండో బంతిని ఫ్లిక్ షాట్గా బౌండరీ సాధించాలని జైస్వాల్ యత్నించాడు. అది నేరుగా షార్ట్ మిడ్ వికెట్లో ఉన్న మిచెల్ మార్ష్ చేతుల్లోకి వెళ్లింది.
ఈ సిరీస్లో జైస్వాల్ను స్టార్క్ ఔట్ చేయడం మూడోసారి. రెండో టెస్టులో జైస్వాల్ను తొలి బంతికే ఔట్ చేసిన స్టార్క్ ఈ మ్యాచ్లో రెండో బంతికి పెవిలియన్కు చేర్చాడు. కాగా, జైస్వాల్ ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ల ముందు తడబడుతున్నాడు. టెస్టుల్లో తొమ్మిది ఇన్నింగ్స్ల్లో ఆరు సార్లు లెఫ్టార్మ్ పేసర్లకే వికెట్ సమర్పించుకున్నాడు. 158 బంతుల్లో 17.33 సగటుతో 104 పరుగులు చేసి ఆరు సార్లు వికెట్ కోల్పోయాడు.

మరోవైపు మిచెల్ స్టార్క్ తన తర్వాతి ఓవర్లోనే మరో వికెట్ సాధించాడు. శుభ్మన్ గిల్ను బోల్తాకొట్టించాడు. స్టార్క్ వేసిన బంతిని డ్రైవ్కు ప్రయత్నించి గల్లీలో ఉన్న మిచెల్ మార్ష్కు గిల్ చిక్కాడు. దీంతో టీమిండియా ఆరు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 117.1 ఓవర్లలో 445 పరుగుల భారీ స్కోరు చేసింది. ట్రావిస్ హెడ్ (152; 160 బంతుల్లో, 18 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (101; 190 బంతుల్లో, 12 ఫోర్లు) శతకాలు సాధించారు.
అలెక్స్ కేరీ (70; 88 బంతుల్లో, 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకం బాదాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఆరు, మహ్మద్ సిరాజ్ రెండు, ఆకాశ్ దీప్, నితీశ్ కుమార్ రెడ్డి చెరో వికెట్ తీశారు. ఓవర్నైట్ స్కోరు 405/7తో మూడో రోజు ఆటను ఆరంభించిన ఆసీస్ మరో 40 పరుగులే చేసి చివరి మూడు వికెట్లు కోల్పోయింది.