గబ్బా వేదికగా భారత్తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 117.1 ఓవర్లలో 445 పరుగుల భారీ స్కోరు చేసింది. ట్రావిస్ హెడ్ (152; 160 బంతుల్లో, 18 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (101; 190 బంతుల్లో, 12 ఫోర్లు) శతకాలు సాధించారు. అలెక్స్ కేరీ (70; 88 బంతుల్లో, 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకం బాదాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఆరు, మహ్మద్ సిరాజ్ రెండు, ఆకాశ్ దీప్, నితీశ్ కుమార్ రెడ్డి చెరో వికెట్ తీశారు.
ఓవర్నైట్ స్కోరు 405/7తో మూడో రోజు ఆటను ఆరంభించిన ఆసీస్ మరో 40 పరుగులే చేసి చివరి మూడు వికెట్లు కోల్పోయింది. టెయిలెండర్లతో కలిసి అలెక్స్ కేరీ స్కోరుబోర్డును ముందుకు నడిపించడానికి ప్రయత్నించాడు. అయితే వరుణుడు దోబూచులాడటంతో ఆటకు వరుసగా అంతరాయాలు ఏర్పడ్డాయి. ఇవాళ ఆట ఆరంభంలోనే మిచెల్ స్టార్క్ను బుమ్రా పెవిలియన్కు చేర్చాడు. కాసేపటికే సిరాజ్, ఆకాశ్ దీప్ కూడా వికెట్లను సాధించడంతో ఆస్ట్రేలియా ఆలౌటైంది.

కాగా, ఆస్ట్రేలియాకు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా (21; 54 బంతుల్లో, 4 ఫోర్లు), మెక్స్వీనె (9; 49 బంతుల్లో, 1 ఫోర్)ని బుమ్రా పెవిలియన్కు చేర్చాడు. కాసేపటికీ లబుషేన్ (12; 55 బంతుల్లో)ను నితీశ్ రెడ్డి ఔట్ చేశాడు.అయితే ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన ట్రావిస్ హెడ్ ఇన్నింగ్స్ స్వరూపాన్ని మార్చాడు. స్టీవ్ స్మిత్తో కలిసి 303 బంతుల్లో 241 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
బుమ్రా పోరాట పటిమతో భారత్ తిరిగి పోటీలోకి వచ్చింది. స్మిత్, హెడ్లతో పాటు ప్రమాదకర బ్యాటర్ మిచెల్ మార్ష్ (5; 16 బంతుల్లో)ను ఔట్ చేశాడు. అయితే ప్యాట్ కమిన్స్ (20; 33 బంతుల్లో, 1 ఫోర్)తో కలిసి అలెక్స్ కేరీ (45 బ్యాటింగ్; 47 బంతుల్లో, 5 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధశతక భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఆస్ట్రేలియాను మరింత పటిష్ట స్థితిలో నిలిపాడు. అయితే ఇవాళ ఆసీస్కు మరింత భారీ స్కోరు అందివ్వాలనుకున్న కేరీకి భారత బౌలర్లు అవకాశం ఇవ్వలేదు.