
హైదరాబాద్: ఇంకొన్ని గంటల్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య కీలకమైన మ్యాచ్ ఆరంభం కాబోతోంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా టీ20 సిరీస్ను తేల్చేసే మ్యాచ్ జరగబోతోంది. మూడు మ్యాచ్ల సిరీస్లో ఇది చివరిది. సిరీస్ డిసైడర్ కూడా ఇదే కావడంతో అందరి కళ్లూ ఈ మ్యాచ్ మీదే ఉన్నాయి. ఇందులో గెలిచిన జట్టే సిరీస్ సొంతం చేసుకుంటుంది. వర్షం పడే ఛాన్స్ దాదాపుగా లేకపోవడంతో హైఓల్టేజ్ మ్యాచ్ను ప్రేక్షకులను ఎంజాయ్ చేయబోతోన్నారు.
మ్యాచ్ను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పలు రకాల వస్తువులను స్టేడియంలోనికి తీసుకెళ్లడానికి అనుమతి ఇవ్వలేదు. నిషేధిత వస్తువుల జాబితాలో పెంపుడు జంతువులు, తినుబండారాలు, సిగరెట్లు, కెమెరాలు, ఇతర రికార్డింగ్ పరికరాలు, ల్యాప్టాప్లు, లైటర్లు, అగ్గిపెట్టెలు, బాణసంచా, సెల్ఫీ స్టిక్స్, పదునైన వస్తువులు, హెల్మెట్లు, బ్యాక్ప్యాక్లు, మద్యం, డ్రగ్స్ చేర్చింది. వీటిల్లో ఏ ఒక్కదాన్ని ప్రేక్షకులు తమ వెంట తీసుకెళ్లినా సిబ్బంది చుక్కలు చూపిస్తారు.
కాగా- తొలిసారిగా స్టేడియం లోపలికి మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడానికి అనుమతులు ఇచ్చారు నిర్వాహకులు. మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. 4 గంటల నుంచే ప్రేక్షకులు స్టేడియంలోపలికి వెళ్లొచ్చు. వారికి అక్కడి సిబ్బంది ప్రవేశం కల్పిస్తారు. స్టేడియంలోకి ప్రవేశించడానికి ఫిజికల్ టిక్కెట్లు తప్పనిసరి. మొబైల్ ఫోన్లో ఫొటోగా తీసిపెట్టుకున్న ఫొటోలను చూపించాలనుకునే వారికి చేదు అనుభవం తప్పదు. సెల్ ఫోన్లల్లో చూపించే టికెట్ల ఫొటోలకు అనుమతి లేదు.
స్టేడియం మొత్తానికీ రాచకొండ పోలీసులు భద్రత కల్పించనున్నారు. దీనికోసం ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో మొత్తం 2,500 మంది పోలీసులను మోహరింపజేశారు. ఎలాంటి అవాంఛీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలను తీసుకున్నారు. స్టేడియంలో 300 సీసీటీవీలను అమర్చారు. స్టేడియం పరిసరాల్లో స్నేక్ క్యాచర్లను అందుబాటులో ఉంచారు. క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.