
నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్ కోసం
నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్ కోసం టీమిండియా సెలక్టర్లు పృథ్వీ షా, మురళీ విజయ్, కేఎల్ రాహుల్ రూపంలో ముగ్గురు ఓపెనర్లని ఎంపిక చేశారు. అయితే, ఈ ముగ్గురితో ఏ ఇద్దరిని ఓపెనర్లుగా బరిలోకి పంపాలనే సమస్య జట్టు మేనేజ్మెంట్ని వెంటాడుతోంది. వెస్టిండీస్తో ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్తో పృథ్వీ షా అరంగేట్రం చేశాడు. తన అరంగేట్ర టెస్టులోనే సెంచరీ సాధించిన అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.

కేఎల్ రాహుల్ విషయానికి వస్తే
మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఆస్ట్రేలియా ఎలెవన్తో గురువారం ప్రారంభమైన వార్మప్ మ్యాచ్లో సైతం ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఈ మ్యాచ్లో రాహుల్ (3) ఔటై నిరాశపరిచాడు. మరోవైపు మురళీ విజయ్ ఫామ్ కూడా ఆందోళనకరంగానే ఉంది. అయితే, ఆస్ట్రేలియా ఎలెవన్తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్లో పృథ్వీషా గాయపడ్డాడు.

ఫీల్డింగ్ చేస్తుండగా షా కాలి మడమకు గాయం
ఫీల్డింగ్ చేస్తుండగా అతడి కాలి మడమకు గాయమైంది. దీంతో అతడు నొప్పితోనే మైదానాన్ని వీడాల్సి వచ్చింది. డీప్ మిడ్ వికెట్ బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న షా.. ఆసీస్ ఓపెనర్ మాక్స్ బ్రయాంట్ కొట్టిన షాట్ను క్యాచ్ పడుతుండగా ఎడమ కాలి మడమకు గాయమైంది. దీంతో పృథ్వీ షా ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి జరగనున్న తొలి టెస్టులో ఆడేది అనుమానంగానే కనిపిస్తోంది. ఇది కేఎల్ రాహుల్కి కలిసొచ్చింది.

షా దూరమైతే కెఎల్ రాహుల్కు లైన్ క్లియర్
తొలి టెస్టుకు పృథ్వీ షా దూరమైతే కెఎల్ రాహుల్కు లైన్ క్లియర్ అయినట్లే. అయితే, నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్లో టీమిండియా విజయంలో ఓపెనర్లే కీలక పాత్ర పోషిస్తారని ఆసీస్ మాజీ కోచ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "మ్యాచ్లో టీమిండియా గెలుపొందాలంటే ఓపెనింగ్ కాంబినేషన్ ఎంతో ముఖ్యం. వారి మధ్య సమన్వయం ఉంటే ఆ జట్టుకు తిరుగుండదు" అని అన్నారు.

టాప్ ఆర్డర్ బలంగా ఉంటే విజయావకాశాలు ఎక్కువ
"టీమిండియాలో ప్రస్తుతం ఎంతో చురుకైన ఆటగాళ్లున్నారు. ఆసిస్ బౌలర్ల ధాటికి ఎదురోడి నిలబడగలిగే ఓపెనర్లని ఎంచుకుంటే చాలు. టాప్ ఆర్డర్ బలంగా ఉంటే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆసిస్ జట్టులో ఓపెనర్లు బలమైన ఆటగాళ్లు. వాళ్లెలాంటి ఒత్తిడినయినా తట్టుకుని పోరాడగలరు. ఒకసారి ఓపెనర్లు విఫలమయితే తర్వాతి మ్యాచ్లో మార్పులు చేస్తుంది. ఆ అలవాటు టీమిండియాకు అలవడితే బాగుంటుంది. ఆసిస్ జట్టులో డేవిడ్ వార్నర్ లాంటి సీనియర్లు లేరు. ఉన్నవాళ్లంతా చాలా వరకు జూనియర్లే. కాబట్టి ఈ సిరీస్ను గెలిచే అవకాశాలు భారత్కే ఎక్కువ" అని జాన్ బ్యుకనన్ అన్నారు.


Click it and Unblock the Notifications












