అహ్మదాబాద్: ఐసీసీ ప్రపంచ కప్ 2023 తుది పోరులో మరోసారి భారత జట్టుకు పరాభవం తప్పలేదు. గుజరాత్లోని ప్రతిష్ఠాత్మక నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో ఘన విజయం సాధించింది ఆస్ట్రేలియా (Ind vs Aus final). ఆరోసారి వరల్డ్ కప్ విజేతగా ఆవిర్భవించింది.
తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న ఆసీస్.. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియాను 240 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం ఈ లక్ష్యాన్ని నాలుగు వికెట్లను కోల్పోయి ఛేదించింది. 43 ఓవర్లల్లో 241 పరుగులతో విజయదుందుభి మోగించింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ సెంచరీతో కదం తొక్కాడు. మిడిలార్డర్ బ్యాటర్ మార్నుస్ లాంబుషెన్ 58 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.

ఈ వరల్డ్ కప్లో ఒక్కసారి కూడా భారత్ ఓడిపోకపోవడానికి ప్రధాన కారణం బౌలర్లే. ప్రతి మ్యాచ్లోనూ పోటీ పడి వికెట్లు నేల కూల్చుతూ వచ్చిన బౌలర్లు ఫైనల్స్లో చేతులెత్తేశారు. నాలుగు వికెట్లే తీయగలిగారు. జస్ప్రీత్ బుమ్రా-2, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.
వరల్డ్ కప్ తరువాత భారత్- ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్ ఆరంభమౌతుంది. అయిదు మ్యాచ్లో సిరీస్ ఇది. వరల్డ్ కప్ టోర్నమెంట్ను ఆరంభం కావడానికి ముందు ఆస్ట్రేలియాతో మూడు వన్డే ఇంటర్నేషనల్స్ను ఆడింది టీమిండియా. 2-1 తేడాతో ఆ సిరీస్ను గెలిచిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా టీ20 సిరీస్ మొదలవుతుంది.
ఈ నెల 23వ తేదీన ఈ టీ20 సిరీస్ షురూ అవుతుంది. విశాఖపట్నం స్టేడియం దీనికి వేదిక. మొత్తం అయిదు మ్యాచ్ల సిరీస్ ఇది. 23, 26, 28, డిసెంబర్ 1, 3వ తేదీల్లో ఇవి షెడ్యూల్ అయ్యాయి. విశాఖతో పాటు తిరువనంతపురం, గువాహటి, నాగ్పూర్, బెంగళూరుల్లో ఈ మ్యాచ్లు షెడ్యూల్ జరుగుతాయి.

ఈ టీ20 సిరీస్లో భారత్తో తలపడే జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ఇదివరకే ప్రకటించింది. మొత్తం 15 మంది సభ్యులు ఉండే టీమ్ ఇది. వికెట్ కీపర్ బ్యాటర్ మాథ్యూ వేడ్.. దీనికి సారథ్యాన్ని వహిస్తాడు. టీ20 స్పెషలిస్ట్గా పేరుంది వేడ్కు. అందుకే కీలకమైన ఈ సిరీస్ కోసం అతనికి జట్టు పగ్గాలను అప్పగించింది.
ఇందులో- మాథ్యూ వేడ్ (కేప్టెన్) జేసన్ బెహ్రెన్డార్ఫ్, సీన్ అబాట్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), స్పెన్సర్ జాన్సన్, గ్లెన్ మ్యాక్స్వెల్, తన్వీర్ సంఘా, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టొయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపాకు చోటు కల్పించింది. కాగా- ఈ సిరీస్ ఆడబోయే భారత జట్టును బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు.