భారత్ మరో ఆసక్తికర సమరానికి సిద్ధమైంది. దక్షిణాఫ్రికా పర్యటనను ఘనంగా ముగించిన టీమిండియా స్వదేశంలో అఫ్గానిస్థాన్తో టీ20 సిరీస్లో తలపడనుంది. మొహాలి వేదికగా ఇవాళ తొలి మ్యాచ్ జరగనుంది. 427 రోజుల తర్వాత పొట్టి ఫార్మాట్తో రోహిత్ తిరిగి టీమిండియా బాధ్యతలు అందుకోనున్నాడు. ప్రపంచకప్కు రోడ్ మ్యాప్గా భావిస్తున్న ఈ సిరీస్ను క్లీన్ స్వీప్ చేయడమే భారత్ లక్ష్యం. మరోవైపు రషీద్ ఖాన్ లేనప్పటికీ రోహిత్సేనకు గట్టి పోటీ ఇవ్వాలని అఫ్గానిస్థాన్ బరిలోకి దిగుతుంది.
దాదాపు 14 నెలల తర్వాత రోహిత్, విరాట్ కోహ్లి టీ20 ఫార్మాట్కు సెలక్ట్ అయ్యారు. కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో పొట్టి ఫార్మాట్కు దూరమయ్యారు. అయితే ఇవాళ మ్యాచ్తో వీరిద్దరి రీఎంట్రీ ఇస్తారనుకుంటే కోహ్లి వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు. చివరి రెండు టీ20లకు అందుబాటులో ఉంటాడు. ఈ నేపథ్యంలో రోహిత్తో పాటు యశస్వీ జైశ్వాల్ ఓపెనర్లుగా, వన్డౌన్లో శుభ్మన్ గిల్ వచ్చే అవకాశం ఉంది.

సూర్యకుమార్ గాయంతో దూరమవ్వడంతో తిలక్ వర్మకు నాలుగో స్థానంలో ఆడే ఛాన్స్ ఉంది. అయిదో స్థానం కోసం సంజు శాంసన్, జితేశ్ శర్మ మధ్య తీవ్ర పోటీ ఉంది. కానీ జట్టు యాజమాన్యం జితేశ్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇక 6, 7 స్థానాల్లో రింకూ సింగ్, అక్షర్ పటేల్ రానున్నారు. పేసర్లు ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్తో పాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ జట్టులో ఉండే అవకాశాలు ఉన్నాయి.
టాస్ కీలకమా?
అయితే ఈ మ్యాచ్లో టాస్ కీలకం కానుంది. గణాంకాల ప్రకారం టాస్ గెలిస్తే రోహిత్ శర్మ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవడం ఉత్తమం. గత రెండేళ్లలో మొహాలి వేదికగా 40 టీ20లు మ్యాచ్లు జరగగా.. ఛేజింగ్ చేసిన జట్టు 26 సార్లు విజయం సాధించింది. మరోవైపు టీమిండియా వరుసగా గత 11 మ్యాచ్ల్లో టాస్ ఓడిపోవడం గమనార్హం. ఈ మ్యాచ్లో రోహిత్ టాస్ గెలిచి ఆ బ్యాడ్ లక్కు బ్రేక్ చెప్పాల్సి ఉంది.
పిచ్ ఎలా ఉంది?
మొహాలి పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశముంది. ఆరంభంలో పేసర్లకు కాస్త అనుకూలిస్తుంది. వర్షం పడే అవకాశం లేదు. కానీ రెండో ఇన్నింగ్స్లో మంచు ప్రభావం తీవ్రంగా ఉండొచ్చు. పొగమంచు ఆటకు అంతరాయం కూడా కలిగించవచ్చు. అయితే చలి తీవ్రతే ఆటగాళ్లుకు అసలైన సవాలు.
మరోవైపు భారత్-అఫ్గానిస్థాన్కు ఇదే తొలి టీ20 ద్వైపాక్షిక సిరీస్ కావడం విశేషం.ఆసియా, ప్రపంచకప్ల్లో భాగంగా ఇప్పటివరకు ఇరు జట్లు అయిదు సార్లు తలపడ్డాయి. నాలుగింట్లో టీమిండియా విజయం సాధించింది. ఒక మ్యాచ్ రద్దు అయింది.
తుది జట్టు అంచనా:
భారత్: రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్.
అఫ్గానిస్థాన్: ఇబ్రహీం జద్రాన్, ఒమర్జాయ్, గుర్బాజ్, కరీం జనాత్, నజీబుల్లా జద్రాన్, నబి, నూర్ అహ్మద్, నవీనుల్ హక్, ఫారూఖీ, ముజీబ్, హజ్రతుల్లా.