
అబుధాబి: టీ20 ప్రపంచకప్ 2021లో పాకిస్తాన్, న్యూజిల్యాండ్ లాంటి పటిష్ట జట్లపై తేలిపోయిన టీమిండియా బ్యాటర్లు.. పసికూన ఆఫ్ఘనిస్థాన్పై మాత్రం రెచ్చిపోయారు. ఓపెనర్లు రోహిత్ శర్మ (74; 47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సులు), కేఎల్ రాహుల్ (69; 48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులు) ఇద్దరూ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ (27; 13 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సులు), ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా (35; 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులు) కూడా ఆకాశమే హద్దుగా చెలరేగారు. మొత్తానికి భారత్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 210 రన్స్ చేసి.. ఆఫ్ఘనిస్థాన్ ముందు 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆప్ఘన్ బౌలర్లలో కరీమ్ జనత్, గుల్బాదిన్ నైబ్ చెరో వికెట్ కూల్చారు.
ఓపెనర్లుగా బరిలోకి దిగిన రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే పోటీపడి మరి బౌండరీలు బాదారు. షరాఫుద్దీన్ వేసిన రెండో ఓవర్లో కేఎల్ రాహుల్ ఫోర్, సిక్స్ బాదగా.. నవీన్ ఉల్ హక్ వేసిన నాలుగో ఓవర్లో రోహిత్ రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. దీంతో ఆ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. తర్వాతి మూడు ఓవర్లో భారత స్కోరు బోర్డు కాస్త నెమ్మదించింది. తర్వాత ఓపెనర్లు ఇద్దరూ మళ్లీ ధాటిగా ఆడారు. దీంతో 10 ఓవర్లకు భారత్ స్కోరు 85/0 వద్ద నిలిచింది. ఈ క్రమంలోనే రోహిత్, రాహుల్ ఇద్దరూ హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. పొట్టి ప్రపంచకప్లలో టీమిండియాకు ఇదే అత్యధిక భాగస్వామ్యం.
అయితే రషీద్ ఖాన్ వేసిన 14వ ఓవర్లో రెండు సిక్స్లు బాదిన రోహిత్ శర్మ.. తర్వాతి ఓవర్లోనే మొహ్మద్ నబీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ కొద్దిసేపటికే కేఎల్ రాహుల్ కూడా పెవిలియన్ చేరాడు. దీంతో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా దూకుడుగా ఆడారు. వచ్చిరావడంతోనే బౌండరీల మోతమోగించారు. గుల్బాదీన్ వేసిన 17వ ఓవర్లో పంత్ రెండు సిక్సర్లు కొట్టాడు. 18వ ఓవర్లో మూడు ఫోర్లు బాదిన హార్ది్క్.. 19వ ఓవర్లో రెండు సిక్స్లు బాదాడు. దాంతో భారత్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఇక 20వ ఓవర్లో పంత్ రెండు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. దీంతో ఆ ఓవర్లో మొత్తం 20 పరుగులు వచ్చాయి.
ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అసలు బ్యాటింగ్ చేయడానికి రాకపోవడం గమనార్హం. 15వ ఓవర్లో రోహిత్ శర్మ వికెట్ పడిన తర్వాత హార్డ్ హిట్టర్ల అవసరం ఉందని గ్రహించిన టీమిండియా.. రిషబ్ పంత్ను రంగంలోకి దింపింది. ఆ తర్వాత కేఎల్ రాహుల్ అవుటైన తర్వాత హార్దిక్ పాండ్యాను బరిలో దింపారు. దీంతో కోహ్లీకి బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. అయితే ఈ వ్యూహం ఫలించిందనే చెప్పాలి. పంత్, హార్దిక్ ఇద్దరూ భారీ షాట్లు ఆడి టీమిండియాకు భారీ స్కోర్ అందించారు.