
అబుదాబి: టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12లో భాగంగా మరికొద్దిసేపట్లో ఆఫ్ఘనిస్తాన్తో భారత్ తలపడనుంది. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన అఫ్గాన్ కెప్టెన్ మొహ్మద్ నబీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ ఓకే మార్పుతో బరిలోకి దిగుతోంది. ముజీబ్ ఈరోజు మ్యాచ్ ఆడడం లేదు. మరోవైపు భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. ఇషాన్ కిషన్, వరుణ్ చక్రవర్తి స్థానాల్లో సూర్యకుమార్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ జట్టులోకి వచ్చారు.
మెగా టోర్నీలో తమ మొదటి రెండు మ్యాచ్లను కోల్పోయిన భారత జట్టు అన్ని రకాలుగా ఇబ్బందుల్లో ఉంది. సెమీ-ఫైనల్కు అర్హత సాధించాలంటే.. భారత్ తమ మిగిలిన మ్యాచ్లలో ఘన విజయాలు సాదించాలి. అంతేకాదు ఇతర జట్ల మ్యాచ్ ఫలితాలు కూడా టీమిండియాకు అనుకూలంగా రావాల్సి ఉంటుంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ కూడా తమ మొదటి మూడు గేమ్లలో రెండింటిలో గెలిచి నాకౌట్ బెర్త్పై కన్నేసింది. దాంతో ఈరోజు మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.
టీ20ల్లో ఆఫ్ఘనిస్థాన్పై భారత్ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు కేవలం రెండు టీ20 మ్యాచ్లు మాత్రమే ఆడాయి. రెండు మ్యాచులోనూ భారత్ విజయం సాధించింది. ఈ రెండు మ్యాచ్లు టీ20 ప్రపంచకప్లలో తలపడడం విశేషం. ఇదే రికార్డును కొనసాగించాలని భారత్ భావిస్తోంది. ఆఫ్ఘనిస్థాన్, భారత్ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, డిస్నీ హాట్ స్టార్ యాప్లో లైవ్ చూడొచ్చు. అబుదాబిలోని పిచ్ బ్యాటింగ్కు అంత గొప్పగా ఏం లేదు. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు కష్టాలను ఎదుర్కొంటోంది. ఛేజింగ్ జట్లు ఎక్కువగా ఆధిపత్యం చెలాయించాయి. ఈ మైదానంలో 78 శాతం మ్యాచ్లు రెండవసారి బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి.
తుది జట్టు:
భారత్: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా.
ఆఫ్ఘనిస్తాన్: హజ్రతుల్లా జజాయ్, మహ్మద్ షాజాద్ (కీపర్), రహ్మానుల్లా గుర్బాజ్, నజీబుల్లా జద్రాన్, షరాఫుద్దీన్ అష్రఫ్, మొహమ్మద్ నబీ (కెప్టెన్), గుల్బాదిన్ నైబ్, రషీద్ ఖాన్, కరీం జనత్, హమీద్ హసన్, నవీన్-ఉల్-హక్.