
హైదరాబాద్: ఘోర పరాజయాలతో టీ20 ప్రపంచకప్ 2021 సెమీ ఫైనల్ అవకాశాలను దాదాపు దూరం చేసుకున్న భారత జట్టు.. నేడు అఫ్గానిస్థాన్తో తలపడనున్నది. తొలి మ్యాచ్లో పాకిస్థాన్ చేతిలో ఖంగుతిన్న టీమిండియా.. రెండో పోరులో న్యూజిలాండ్ చేతిలో అవమానకర ఓటమి ఎదుర్కొంది. ఇక గ్రూప్-2లో మిగిలిన మూడు మ్యాచ్లు నెగ్గినా.. ముందడుగు వేయడం కష్టమైన తరుణంలో మరికొద్దిసేపట్లో నబీ సేనను ఎదుర్కోనుంది. బ్యాటింగ్, బౌలింగ్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్న కోహ్లీసేన.. అదే వరస కొనసాగిస్తే అఫ్గాన్ కూడా టీమిండియాకు షాక్ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఓ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. మరో మూడు వికెట్లు పడగొడితే టీ20 ఫార్మాట్లో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలవనున్నాడు. అఫ్గానిస్థాన్తో జరిగే మ్యాచులో బుమ్రా ఈ అరుదైన ఫీట్ను సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం బుమ్రా 52 టీ20ల్లో 61 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ 49 టీ20ల్లో 63 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ (52), భువనేశ్వర్ కుమార్ (50), హార్ధిక్ పాండ్యా (42)లు వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
టీ20 ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో బంగ్లాదేశ్ స్పిన్నర్ షకీబ్ అల్ హసన్ అగ్రస్థానంలో ఉన్నాడు. షకీబ్ 94 మ్యాచ్ల్లో 117 వికెట్లు పడగొట్టాడు. షకీబ్ తర్వాత లసిత్ మలింగ (84 మ్యాచ్ల్లో 107), రషీద్ ఖాన్ (54 మ్యాచ్ల్లో 102), టిమ్ సౌథీ (85 మ్యాచ్ల్లో 101) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో జస్ప్రీత్ బుమ్రా 21వ స్థానంలో ఉన్నాడు. టాప్-10లో ఒక్క భారత బౌలర్ లేకపోవడం గమనార్హం.
ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా ఏకంగా పది స్థానాలు ముందుకు జరిగి 24వ ర్యాంకులో నిలిచాడు. శ్రీలంక లెగ్ స్పిన్నర్ వనిందు డి సిల్వా కెరీర్లో తొలిసారి అగ్రస్థానానికి చేరుకున్నాడు. టీ20 ప్రపంచకప్లో భాగంగా దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్ల్లో వరుసగా మూడు వికెట్ల ప్రదర్శన చేసి ఈ మార్క్ను అందుకున్నాడు.ఆల్రౌండర్ విభాగంలో షకీబ్ అల్ హసన్ను వెనక్కినెట్టి అఫ్గానిస్థాన్ ఆటగాడు మహ్మద్ నబీ అగ్రస్థానంలో నిలిచాడు. శ్రీలంక ప్లేయర్ వనిందు డి సిల్వా నాలుగో ర్యాంకులో కొనసాగుతున్నాడు.