భారత్తో సిరీస్ ఆరంభానికి ముందే అఫ్గానిస్థాన్కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ రషీద్ ఖాన్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. టీమిండియాతో అఫ్గాన్ మూడు టీ20ల సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్లో తొలి మ్యాచ్ మొహాలి వేదికగా జరగనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
రషీద్ ఖాన్ గతేడాది నవంబర్లో వెన్నునొప్పికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. కోలుకున్నాడని భావించిన అఫ్గాన్ సెలక్టర్లు రషీద్ ఖాన్ పేరును టీమిండియా సిరీస్కు జట్టులో చేర్చారు. కానీ అతడు పూర్తి ఫిట్నెస్ సాధించలేదని అఫ్గానిస్థాన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ తెలిపాడు. రషీద్ స్థానంలో లెగ్ స్పిన్నర్ కైస్ను తీసుకున్నారు.

''రషీద్ ఖాన్ ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. భారత్ సిరీస్కు అతడు దూరమయ్యాడు. కానీ ప్రస్తుతం జట్టుతోనే ఉన్నాడు. అతడు త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నాం. అయితే రషీద్ లేకపోవడం మాకు ప్రతికూలతనే. కానీ ఇది క్రికెట్, మేం అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. మా జట్టులో మంచి టీ20 ప్లేయర్లు ఉన్నారు. అందరూ బాగానే ఆడుతున్నారు. మంచి ప్రదర్శన చేస్తారని భావిస్తున్నా. భారత్తో సిరీస్ గొప్పగా సాగుతుందని ఆశిస్తున్నా'' అని ఇబ్రహీం పేర్కొన్నాడు.
దాదాపు 14 నెలల తర్వాత తిరిగి టీ20 జట్టులోకి వచ్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అఫ్గానిస్థాన్ సిరీస్లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. మరోవైపు జూన్లో జరగనున్న టీ20 ప్రపంచకప్ ముందు భారత్ తలపడే ఆఖరి టీ20 సిరీస్ ఇదే కావడం గమనార్హం. మొహాలి వేదికగా రేపు తొలి మ్యాచ్ జరగనుంది. ఇండోర్, బెంగళూరు వేదికగా జనవరి 14, 17వ తేదీల్లో చివరి టీ20లు జరగనున్నాయి.
భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్
అఫ్గానిస్థాన్ జట్టు:
ఇబ్రహీమ్ జద్రాన్(కెప్టెన్), గుర్బాజ్, హజాయ్, అలిఖిల్, రెహ్మాత్ షా, మహమ్మద్ నబీ, జనత్, ఓమార్జాయ్, అష్రఫ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజలక్ ఫరూఖీ, మాలిక్, నవీన్ ఉల్ హక్, అహ్మద్, సలీమ్, అహ్మద్, నైబ్, కైస్