బెంగళూరు వేదికగా అఫ్గానిస్థాన్తో జరిగిన ఆఖరి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. మూడు టీ20ల సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. అయితే చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారింది. 40 ఓవర్లలో ఏకంగా 424 పరుగులు వచ్చాయి. అంతేగాక రెండు సూపర్ ఓవర్లు జరిగాయి. నరాలు తెగే ఉత్కంఠతో జరిగిన ఈ మ్యాచ్ చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్లో తొలిసారిగా రెండో సూపర్ ఓవర్తో ఫలితం తేలిన మ్యాచ్గా రికార్డులకెక్కంది.
అయితే తొలి సూపర్ ఓవర్లో రోహిత్ శర్మతో కలిసి యశస్వీ జైశ్వాల్ బ్యాటింగ్కు రావడం చర్చనీయాంశంగా మారింది. సూపర్ ఫామ్లో ఉన్న రింకూ సింగ్ను కాదని జైశ్వాల్కు అవకాశం ఇవ్వడాన్ని క్రికెట్ విశ్లేషకులు తప్పుబడుతున్నారు. 22/4తో కష్టాల్లో నిలిచిన జట్టును రోహిత్ శర్మ (121*; 69 బంతుల్లో)తో కలిసి రింకూ సింగ్ (69*; 39 బంతుల్లో) అద్భుతంగా పోరాడి ఆదుకున్నాడు. ఇన్నింగ్స్ చివరి మూడు బంతుల్ని భారీ సిక్సర్లగా మలిచి స్కోరును 212కు చేర్చాడు.

కానీ, రోహిత్తో కలిసి జైశ్వాల్ సూపర్ ఓవర్కు వచ్చాడు. జైశ్వాల్ కూడా స్ట్రోక్ ప్లేయర్ అయినప్పటికీ రింకూ ఆ సమయంలో స్వింగ్లో ఉన్నాడు. అంతేగాక అతడు పవర్ హిట్టర్. అయితే జైశ్వాల్ సూపర్ ఓవర్లో ఎదుర్కొన్న రెండు బంతులకు రెండు పరుగులే చేశాడు. సూపర్ ఓవర్లో భారత్ విజయానికి ఆఖరి బంతికి రెండు రెండు పరుగులు అవసరమయ్యాయి. ఆ సమయంలో స్ట్రైక్లో ఉన్న జైశ్వాల్ నిరాశపరిచాడు. షాట్ ప్లేస్మెంట్లో తికమకపడి మొత్తంగా వికెట్కీపర్కు బంతిని అందించాడు. మరోఎండ్లో ఉన్న రింకూ చిరుతలా పరిగెత్తడంతో ఒక్క పరుగు వచ్చి తొలి సూపర్ ఓవర్ టైగా ముగిసింది.
అయితే మరో సూపర్ ఓవర్లో సంజు శాంసన్ను పంపించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. రెండో సూపర్ ఓవర్లో రింకూ ఔటైన తర్వాత సంజు క్రీజులోకి వచ్చాడు. కోహ్లి వస్తాడని భావించిన అభిమానులు స్టేడియంలో కోహ్లి కోహ్లి అంటూ నినాదాలు కూడా చేశారు. సామర్థ్యాలు, గణాంకాల పరంగా చూస్తే విరాట్ కోహ్లికి పోటీగా ఎవరూ లేరు. అయితే శాంసన్ భారీ సిక్సర్లు సాధిస్తాడని అవకాశం ఇచ్చినట్లుగా భావించినా.. చిన్నస్వామి మైదానంలో బౌండరీల దూరం తక్కువగా ఉంటుంది. ఆర్సీబీ తరపున ఇదే మైదానంలో కోహ్లి గతంలో సిక్సర్ల వర్షం కురిపించాడు.

జైశ్వాల్, శాంసన్ను పంపించడం చెత్త నిర్ణయాలుగా నెట్టింట్లో కామెంట్లు వస్తున్నాయి. అయితే ఆటగాళ్లకు అనుభవం వస్తుందనే ఉద్దేశంతో టీమిండియా మేనేజ్మెంట్ ఈ నిర్ణయాలు తీసుకొని ఉండొచ్చని కొందరు నెటిజన్లు మద్దతు ఇస్తున్నారు. కాగా, జనవరి 25 నుంచి ఇంగ్లాండ్తో భారత్ అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది.