
ఇంజిమామ్ కెరీర్లో 25 సెంచరీలు
పాకిస్థాన్ జట్టుకి దాదాపు 15 ఏళ్లు ప్రాతినిథ్యం వహించిన ఇంజిమామ్ ఉల్ హక్ కెరీర్లో 120 టెస్టులాడి 25 సెంచరీలు సాధించగా.. విరాట్ కోహ్లీ కేవలం 72 టెస్టుల్లోనే 24 సెంచరీలతో అతడ్ని సమీపించాడు. వెస్టిండీస్తో శుక్రవారం నుంచి హైదరాబాద్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరగనుండగా.. తనకి బాగా కలిసొచ్చిన ఉప్పల్ మైదానంలో మరో సెంచరీ బాది ఇంజిమామ్ రికార్డుని అందుకోవాలని కోహ్లి ఆశిస్తున్నాడు.

ఇప్పటికే సెహ్వాగ్ను దాటేసి:
టెస్టుల్లో అత్యధిక సెంచరీలు బాదిన బ్యాట్స్మెన్ జాబితాలో భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 51 సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. 24 సెంచరీతో కోహ్లి ప్రస్తుతం 21వ స్థానంలో ఉన్నాడు. ద్రవిడ్ (36), సునీల్ గవాస్కర్ (34)లు కోహ్లి కన్నా ముందు ఉన్నారు. ఇక సెహ్వాగ్ 23 సెంచరీలతో కోహ్లి తర్వాతి స్థానంలో నిలిచాడు. 72 టెస్టుల్లో కోహ్లి 24 సెంచరీలు సాధించగా 103 టెస్టుల్లో సెహ్వాగ్ 23 సెంచరీలు పూర్తి చేశాడు.

కెప్టెన్ల జాబితాలో కోహ్లీ రెండో స్థానంలో
అత్యధిక సార్లు ఫాలోఆన్ ఆడించిన భారత కెప్టెన్ల జాబితాలో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకూ ప్రత్యర్థి జట్టును కోహ్లీ ఐదు సార్లు ఫాలోఆన్కు ఆహ్వానించగా, మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ ఏడుసార్లు ఫాలో ఆన్ ఆడించాడు. దాంతో ఎక్కువ సార్లు ఫాలోఆన్ ఆడించిన భారత కెప్టెన్ల జాబితాలో కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు.

వన్డే ర్యాంకింగ్స్లో మళ్లీ అగ్రస్థానంలో కోహ్లీ
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రాలు వన్డే ర్యాంకింగ్స్లో మళ్లీ అగ్రస్థానంలో నిలిచారు. సోమవారం ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్లో 884 పాయింట్లతో బ్యాట్స్మెన్ జాబితాలో కోహ్లీ అగ్రస్థానంలో నిలవగా.. బౌలర్ల ర్యాంకింగ్స్లో 797 పాయింట్లతో బుమ్రా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.


Click it and Unblock the Notifications
