రోహిత్కు 100వ టీ20: రెండో టీ20లో పంత్, అయ్యర్, ధావన్ సాధించే మైలురాళ్లివే!

హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టీ20 గురువారం రాజ్కోట్ వేదికగా జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి టీ20లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లో విఫలమై టీమిండియా భారీ మూల్యం చెల్లించుకున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో రెండో టీ20లో గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. పొట్టి ఫార్మాట్లో భారత్పై తొలి విజయం సాధించిన బంగ్లా.. అదే జోష్లో సిరీస్ చేజిక్కించుకోవాలని చూస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్కు మహా తుపాను రూపంలో వరుణుడి ముప్పు పొంచి ఉంది.

రోహిత్ శర్మ అరుదైన మైలురాయి
రోహిత్ శర్మకు ఇది 100వ టీ20. దీంతో భారత్ తరుపున అత్యధిక టీ20లు ఆడిన ఆటగాడిగా రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించనున్నాడు. ఈ సిరిస్లో భాగంగా గత ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి టీ20తో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(98 టీ20లు) రికార్డుని అధిగమించాడు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక టీ20లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో పాకిస్థాన్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్(111) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బంగ్లాతో జరుగుతున్న మూడు టీ20ల సిరిస్కు రోహిత్ కెప్టెన్గా వ్వవహారిస్తున్నాడు.

ధావన్, సుందర్ వ్యక్తిగత రికార్డులు
ఓపెనర్ శిఖర్ ధావన్, ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఈ మ్యాచ్లో వ్యక్తిగత మైలురాళ్లను అందుకోనున్నారు. ధావన్ మొత్తంగా తన కెరీర్లో 100వ టీ20 మ్యాచ్ని ఆడుతున్నాడు. భారత్ తరుపున ఇది 56వ టీ20 కావడం విశేషం. ఇక, వాషింగ్టన్ సుందర్ తన 50వ టీ20 మ్యాచ్ని ఆడుతున్నాడు.

ఎలైట్ జాబితాలోకి రిషబ్ పంత్
రిషబ్ పంత్ ప్రస్తుతం కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాడు. వెస్టిండిస్ పర్యటన నుంచి కూడా టీ20ల్లో సత్తా చాటలేకపోతున్నాడు. ఈ సిరిస్లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి టీ20లో పంత్ ప్రదర్శన నిరాశపరిచింది. అయితే, రాజ్కోట్ వేదికగా జరిగే రెండో టీ20లో పంత్ ఒక క్యాచ్ పడితే టీ20ల్లో వికెట్ కీపర్గా 50 క్యాచ్లను పూర్తి చేసుకుంటాడు.

శ్రేయాస్ అయ్యర్ ముందు మరో మైలురాయి
వెస్టిండిస్ పర్యటనతో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన శ్రేయాస్ అయ్యర్ ఈ మధ్య కాలంలో పరిమిత ఓవర్ల ఫార్మాట్లో చక్కగా రాణిస్తున్నాడు. ఒత్తిడి సమయాల్లో శ్రేయాస్ అయ్యర్ ప్రదర్శించిన తీరుపై కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో మరో 10 పరుగులు చేస్తే ఈ ఏడాది టీ20ల్లో 1000 పరుగులు చేసిన ఆటగాడిగా అరుదైన ఘనత సాధిస్తాడు. ఒక ఏడాదిలో వెయ్యి పరుగులు చేసిన మొదటి భారత్ బ్యాట్స్మెన్ కావడంతో పాటు మొత్తంగా 14వ ఆటగాడిగా అరుదైన ఘనత సాధిస్తాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications