హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో బంగ్లాదేశ్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో భారత ఆటగాళ్లు పలు రికార్డులు నమోదు చేశారు. ఈ టెస్టులో టీమిండియా ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. బంగ్లా టెస్టులో టీమిండియా ఇప్పటి వరకు సాధించని రికార్డులను సృష్టించింది.
వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా 80 పరుగులు చేయడంతో టీమిండియా ఇప్పటివరకు సాధించని ఓ రికార్డుని సొంతం చేసుకుంది. ఒక జట్టులోని టాప్ 7 బ్యాట్స్మెన్లలో ఐదుగురు ఆటగాళ్లు 80కి పైగా పరుగులు చేయడం ఇది ఏడోసారి. ఇదిలా ఉంటే టీమిండియా మాత్రం ఈ ఘనతను సాధించడం ఇదే తొలిసారి.
బంగ్లాదేశ్తో ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఏకైక టెస్టులో టీమిండియా భారీ స్కోరు చేసింది. భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. తద్వారా వరుసగా మూడోసారి టీమిండియా 650కు పైగా పరుగులు సాధించింది. టాస్ గెలిచిన టీమిండియా తొలి రోజు ఆటలో మురళీ విజయ్ 108, పుజారా 83, కోహ్లీ 204లు రాణించారు.

ఇక రెండో రోజైన శుక్రవారం రహానే 82, సాహా 106, జడేజా 60 పరుగులతో రాణించారు. దీంతో టీమిండియా 166 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 687 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. బంగ్లా ఏకైక టెస్టులో టీమిండియా ఆటగాళ్లు పలు రికార్డులను బద్దలు కొట్టారు. ఈ టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
టెస్టుల్లో కోహ్లీ వరుసగా నాలుగో డబుల్ సెంచరీని సాధించాడు. తద్వారా టెస్టు క్రికెట్ చరిత్రలో వరుసగా నాలుగు సిరీస్లలో నాలుగు డబుల్ సెంచరీలు చేసిన తొలి బ్యాట్స్మన్గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. రెండో రోజు 111 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ప్రారంభించిన కోహ్లీ డబుల్ సెంచరీని సాధించాడు.
అంతక ముందు కోహ్లీ ఆడిన వెస్టిండిస్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ సిరిస్లలో వరుసగా మూడు డబుల్ సెంచరీలు చేసిన కోహ్లీకి ఇది నాలుగో డబుల్ సెంచరీ కావడం విశేషం. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజాలు డాన్ బ్రాడ్మన్, రాహుల్ ద్రవిడ్ లాంటి దిగ్గజాలను కోహ్లీ అధిగమించాడు. డాన్ బ్రాడ్మన్, రాహుల్ ద్రవిడ్లు మాత్రమే వరుసగా మూడు సిరిస్లలో మూడు డబుల్ సెంచరీలను సాధించారు.