
భారత స్టార్ బౌలర్ దీపక్ చాహర్ గురించి భారత మాజీ పేసర్ లక్ష్మీపతి బాలాజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాబోయే ఆసియాకప్ టోర్నీకి టీంలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ లేకపోవడంతో దీపక్ చాహర్ ఫస్ట్-ఛాయిస్ బౌలర్గా ఉండాల్సిందని పేర్కొన్నాడు. వెన్ను గాయం కారణంగా బుమ్రా జట్టుకు దూరం కాగా.. షమీని సెలెక్టర్లు సెలెక్ట్ చేయలేదు. టీ20 ఫార్మాట్లో ఆసియా కప్ ఆగస్టు 27న యూఏఈలో ప్రారంభం కానుంది. ఆగస్టు 28న పాకిస్థాన్పై భారత్ తమ తొలి మ్యాచ్ ఆడబోతుంది. ఇక ఈ టోర్నీకి ఎంపికైన జట్టులో భువనేశ్వర్ కుమార్, అవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్ బౌలర్లుగా ఉన్నారు. స్టాండ్బై బౌలర్గా దీపక్ చాహర్ ఉన్నాడు. అతను తన గాయాల నుంచి కోలుకుని ఫిట్ నెస్ సాధించాక ఇటీవల జరిగిన జింబాబ్వే పర్యటనలో మళ్లీ జట్టులోకి తిరిగి వచ్చాడు. ఫిబ్రవరిలో వెస్టిండీస్తో జరిగిన మూడో టీ20 సమయంలో కుడి క్వాడ్రిస్ప్స్ గాయంతో జట్టుకు దూరమైన చాహర్ అప్పటి నుంచి ఐపీఎల్, భారత ఆడిన ఇతర సిరీస్లకు పూర్తిగా దూరమయ్యాడు.
చాహర్ గురించి చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ బాలాజీ మాట్లాడుతూ.. 'యుఏఈలో.. ప్రత్యర్థి బ్యాటింగ్కు తొలుత సవాల్ విసరడానికి, పైచేయి సాధించడానికి కొత్త బంతితో స్వింగ్ చేసే నైపుణ్యమున్న బౌలర్లు కావాలి. అలాగే జట్టుకు కావాల్సింది కొత్త బంతితో వికెట్లు తీసే బౌలర్. దీపక్ చాహర్ మీకు ప్రారంభంలోనే వికెట్లు తీయగలడు. షమీ, బుమ్రా లేరు కాబట్టి అతనిని ఫస్ట్ ఛాయిస్ బౌలర్గా చూడాల్సింది. ఎందుకంటే అతను వికెట్ టేకర్. అయితే ప్రస్తుతం భారత్కు చాలా మంది బౌలర్లు ఉన్నారు. జట్టులో చాలా పోటీ ఉంది. అదే చాహర్కు జట్టులో స్థానాన్ని దక్కనీయలేదు. ఏదేమైనా చాహర్ చాలా మెరుగుపడ్డాడు. అతను చాలా బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడు' అని బాలాజీ అన్నాడు.
ఇకపోతే గాయం నుండి కోలుకున్న తర్వాత చాహర్ జింబాబ్వేతో ఆడిన తన మొదటి వన్డేలోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ప్రదర్శనను అందించాడు. మూడు టాపార్డర్ వికెట్లు తీశాడు. రెండో గేమ్లో అతను బెంచ్కు పరిమితమయ్యాడు. మళ్లీ మూడో మ్యాచ్లో అందుబాటులోకి వచ్చాడు. రెండు వికెట్లు తీశాడు. ఈ రెండు మ్యాచ్ల్లో మొత్తం అయిదు వికెట్లు తీసి రాణించాడు.