
రిషబ్ పంత్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి అతన్ని లెజెండరీ ప్లేయర్ ఎంఎస్ ధోనీతో పోల్చుతూ కామెంట్లు, పోస్టులు పోటెత్తిన సంగతి తెలిసిందే. కీపింగ్ విషయంలోను, బ్యాటింగ్ విషయంలోను ఇరువురి మధ్య సేమ్ పోలికలున్నాయంటూ ఆ మధ్య పోస్టులు కూడా వచ్చాయి. ఇక భారత కాబోయే కెప్టెన్ పంత్ అంటూ కూడా మాజీలు, కొందరు విశ్లేషకులు కూడా అభిప్రాయపడ్డారు. అయితే ఇటీవల పంత్ హవా క్రమేపీ తగ్గుతుంది. అతను టీ20 ఫార్మాట్లో సరితూగని ప్లేయర్ అంటూ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇకపోతే భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ మాత్రం పంత్లో ధోనీ తరహా నైపుణ్యం, నాలెడ్జ్ ఉందని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ క్రికెట్ జట్టులో కోచింగ్ బాధ్యతలను శ్రీధర్ నిర్వర్తిస్తున్నాడు. రిషబ్ క్రికెట్ ఆడే విధానంలో ధోనీని అనుసరించాడని అభిప్రాయపడ్డాడు.
'పంత్లో కొంచెం మహేంద్ర ధోనీ ఉన్నాడు. సహజంగానే మీరు ఎవరినైనా ఆరాధించి పెరిగినప్పుడు.. వారిలోని లక్షణాలు మీలో ఎంతో కొంత భాగమవుతాయి. అందువల్ల మీరు రిషబ్లో కొంచెం మహీని చూడవచ్చు. అతను గొప్ప వ్యక్తిని ఆరాధిస్తూ పెరిగాడు' అని శ్రీధర్ క్రికెట్.కామ్తో అన్నారు. 'పంత్ చాలా స్నేహపూర్వకంగా, చాలా ఉల్లాసంగా కనిపిస్తాడు. అతను గ్రౌండ్లో, గ్రౌండ్ బయట కూడా నవ్వుతూ ఉంటాడు. అతను గ్రౌండ్లో ఉన్నప్పుడు అతను మిగతా అన్ని విషయాలను పూర్తిగా పక్కనపెడతాడు. మైదానంలో చాలా రిలాక్స్గా ఉంటాడు. అందరితో సరదాగా గడపడానికి ఇష్టపడే వ్యక్తి. ఇవన్నీ ధోనీలోను కొట్టొచ్చినట్లు కన్పిస్తాయి.' అని శ్రీధర్ రిషబ్ వ్యక్తిత్వం గురించి చెప్పాడు.
ఇకపోతే ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో రిషబ్ పంత్కు బదులు దినేష్ కార్తీక్ తుది జట్టులో ఆడిన సంగతి తెలిసిందే. అయితే పంత్ విషయంలో భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ వైఖరి మాత్రం స్పష్టంగా ఉంది. అతన్ని తప్పకుండా జట్టులో కొనసాగించేందుకు ద్రావిడ్ కట్టుబడ్డట్లు స్పష్టమవుతుంది. ఇటీవల ద్రావిడ్ను విలేకరులు పంత్ టీ20 ప్రపంచకప్ తుది జట్టులో ఉంటాడా అని అడగ్గా.. 'మేము పరిస్థితులు, ప్రత్యర్థులను అనుసరించి ఉత్తమ ప్లేయింగ్ 11ను తీసుకుని ఆడుతాం. ప్లేయింగ్ XIలో వీళ్లు కచ్చితంగా ఉండాలా వద్దా అనే డైలామాలు ఉండవు. అది తరచూ మారుతూనే ఉంటుంది.' ద్రావిడ్ విషయాన్ని దాటవేశాడు.