
హైదరాబాద్: కుల్దీప్ యాదవ్... భారత క్రికెట్ జట్టులో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న చైనామన్ స్పిన్నర్. తన విలక్షణ బౌలింగ్తో ఇప్పటికే జట్టులో కీలకమయ్యాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరిస్లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన కుల్దీప్ వన్డేల్లో హ్యాట్రిక్ తీసిన భారత మూడో బౌలర్గా అరుదైన ఘనత సాధించాడు.
అలాంటి కుల్దీప్ ఓ సంచలన విషయాన్ని వెల్లడించాడు. 13 ఏళ్ల వయసులో ఉత్తర్ప్రదేశ్ అండర్-15 జట్టుకు ఎంపిక కాకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట. అంతేకాదు క్రికెట్ నుంచే తప్పుకోవాలనుకున్నాడట. స్వయంగా కుల్దీపే ఈ విషయాలు వెల్లడించాడు.
'జట్టుకు ఎంపిక కావడం కోసం తీవ్రంగా శ్రమించా. కానీ నన్ను ఎంపిక చేయలేదు. అసహనంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. ఆవేశంలో ఎవరికైనా ఇలా జరుగుతుంది. స్కూల్లో నేను చదువులో ముందుండేవాణ్ని. సరదా కోసమే క్రికెట్ ఆడేవాన్ని' అని కుల్దీప్ చెప్పాడు.
ఇక జన్మలో మరోసారి క్రికెట్ జోలికి వెళ్లకూడదని అనుకున్నానని తెలిపాడు. తొలుత పేస్ బౌలర్ కావాలనుకున్నానని... అయితే కోచ్ సూచన మేరకు స్పిన్ ను ఎంచుకున్నానని వెల్లడించాడు. పాక్ క్రికెటర్ వసీమ్ అక్రమ్, ఆసీస్ దిగ్గజం షేన్ వార్న్లు తనకు ఎంతో ఇష్టమని చెప్పాడు.
'నిజం చెప్పాలంటే నేను క్రికెట్ ఆడాలని మా నాన్న కోరుకున్నాడు. కోచ్ దగ్గరికీ తీసుకెళ్లాడు. ఫాస్ట్బౌలర్ను కావాలన్నది నా కోరిక. కానీ మా కోచ్ బలవంతంగా నన్ను స్పిన్నర్ను చేశాడు' అని కుల్దీప్ చెప్పాడు. షేన్ వార్న్ వీడియోలు ఇప్పటికీ చూస్తానని కుల్దీప్ అన్నాడు.
గతేడాది మార్చిలో ధర్మశాలలో జరిగిన టెస్టులో తొమ్మిది వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇటీవల కివీస్తో జరిగిన మూడో టీ20 కూడా తీపి జ్ఞాపకాలను మిగిల్చిందని చెప్పాడు. 'ఆ పరిస్థితుల్లో నేను ఎంతో ఉత్కంఠకు లోనయ్యాను. అయితే నా బంతులను సరైన దిశలో, సరైన స్థానంలో సంధించి సక్సెస్ సాధించాను' అని తెలిపాడు.
ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ధోనీల నుంచి తనకు ఎంతో మద్దతు లభిస్తోందని తెలిపాడు. ప్రత్యర్థుల బలాబలాలకంటే స్వశక్తినే నమ్ముతానని కుల్దీప్ అన్నాడు. నవంబర్ 16నుంచి శ్రీలంకతో ఆరంభమయ్యే టెస్టు సిరీస్ కోసం కుల్దీప్ కాన్పూర్లో ప్రాక్టీస్ చేస్తున్నాడు.