
హైదరాబాద్: ఐపీఎల్ 2018 అనంతరం జరగనున్న తొలి విదేశీ పర్యటనలో భాగంగా టీమిండియా ఐర్లాండ్ చేరుకుంది. మరికొద్ది రోజుల్లో అంటే జూన్ 27, 29న జరగనున్న రెండు టీ20ల సిరీస్ కోసం భారత జట్టు తీవ్రంగా శ్రమిస్తోంది. రెండు రోజుల క్రితం ఐర్లాండ్కి చేరుకున్న భారత జట్టు అక్కడ ఒకవైపు నెట్స్లో ప్రాక్టీస్ చేస్తూనే.. మరోవైపు జిమ్లో చెమటోడ్చుతోంది.
ముందుగానే జట్టును ప్రకటించినా యోయో టెస్టు పాసైతేనే విదేశీ పర్యటనకు వెళ్లాలని షరతు విధించడంతో.. ఐపీఎల్లో బాగానే రాణించినప్పటికీ పర్యటనకు జట్టులో స్థానం దక్కించుకోలేకపోయారు. అంతేకాదు.. తాము సాధించిన ఫిట్నెస్ కాపాడుకోవాలనే ప్రయత్నంలో ప్రస్తుతం టీమిండియా ఫిట్నెస్పై ప్రత్యేక శ్రద్ధపెట్టింది.
ఇందులో భాగంగానే భారత కెప్టెన్ విరాట్ కోహ్లి, దినేశ్ కార్తీక్ పాటు బౌలర్లు భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, చాహల్ సైతం జిమ్లో కఠినమైన కసరత్తులు చేస్తూ కనిపించారు. ఐర్లాండ్ పర్యటన ముగిసిన తర్వాత జూలై 3 నుంచి ఇంగ్లాండ్తో మూడు టీ20లు, మూడు వన్డేలతో పాటు ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ని భారత్ ఆడనుంది.
కఠినమైన ఆ పర్యటనకి ముందు ఐర్లాండ్తో టీ20 సిరీస్లో మెరుగ్గా రాణించి లయ అందుకోవాలని టీమిండియా ఆశిస్తోంది. ఐపీఎల్ 2018 సీజన్ ముగిసిన తర్వాత అఫ్గానిస్థాన్తో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడినా.. ఏకపక్షంగా రెండు రోజుల్లోనే అది ముగియడంతో భారత్కి తగినంత ప్రాక్టీస్ లభించలేదు. దీంతో.. ఈ రెండు టీ20ల సిరీస్పై భారత్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ పర్యటన అనంతరం టీమిండియా నేరుగా ఇంగ్లాండ్కు వెళ్లనుంది.