హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్లో భాగంగా బుధవారం హర్యానా స్టీలెర్స్, గుజరాత్ ఫార్చున్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగి 27-27తో టైగా ముగిసింది. చివరి 5 నిముషాలలో హర్యానా స్టీలర్స్ ఆటగాళ్లు 13 పాయింట్లు సాధించడంతో ఆట ముగిసే సమయానికి రెండు జట్లు సమంగా నిలిచాయి.
హర్యానా జట్టులో రైడర్లు సుర్జీత్ సింగ్ 6, వికాస్ ఖండోలా 7, సురీందర్ నదా 7 పాయింట్లతో రాణించగా.. గుజరాత్ జట్టులో మహేంద్ర కుమార్ 5 రైడింగ్ పాయింట్లు సాధించాడు. తొలిమ్యాచ్లో ఢిల్లీ దబాంగ్ను చిత్తు చేసిన ఉత్సాహంలో బరిలోకి దిగిన గుజరాత్ జట్టు ఆరంభం నుంచే దూకుడుని ప్రదర్శించింది.

తొలి రెండు నిమిషాల ఆటలో ఇరుజట్లు కూడా పాయింట్లు సాధించలేకపోయాయి. మూడో నిమిషంలో గుజరాత్ రెండు రైడింగ్ పాయింట్లతో ఆటలో ఊపు తీసుకువచ్చింది. అదే ఊపులో 4-0 పాయింట్లతో ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. ఆరో నిమిషంలో ఖాతా తెరిచిన స్టీలర్స్ వరుసగా పాయింట్లు సాధించి గుజరాత్ ఆధిక్యాన్ని 4-5కు తగ్గించింది.
ఆ తర్వాత గుజరాత్ రైడర్లపై తమ ఢిపెండర్లు ఒత్తిడి తేవడంతో 13వ నిమిషంలో హర్యానా 8-8తో స్కోరు సమం చేసింది. రెండు నిమిషాల్లో మూడు పాయింట్లు సంపాదించిన గుజరాత్ తొలి అర్ధభాగం ముగిసేసరికి 11-8తో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగంలో సబ్స్టిట్యూట్గా దిగిన సుర్జీత్ సింగ్ రైడింగ్లో రెండు పాయింట్లు తేవడంతో స్టీలెర్స్ 10-11 స్కోరు చేసింది.
మ్యాచ్ 24వ నిమిషానికి 12-11తో హర్యానా ఆధిక్యంలోకి దూసుకెళ్లగా.. గుజరాత్ జట్టు కోర్టులో ముగ్గురే మిగిలారు. ఈ సమయంలో సూపర్ ట్యాకిల్ పాయింట్ సంపాదించిన గుజరాత్ 13-12 తో ఆధిక్యం అందుకుంది. కానీ 40 సెకన్లలోపు మూడు పాయింట్లు సాధించి, హర్యానా జట్టు పాయింట్ల దూరాన్ని 17-22కి తగ్గించింది.
22-15తో విజయంవైపు సాఫీగా సాగుతున్న గుజరాత్ జట్టుకు అనుకోని ప్రతిఘటన ఎదురైంది. 34వ నిమిషంలో వికాస్ ఖండోలా కళ్లు చెదిరే సూపర్ రైడ్తో గుజరాత్ ఆధిక్యం 22-20కు పడిపోయింది. ఆ తర్వాతి నిమిషంలో గుజరాత్ను ఆలౌట్ చేసిన హర్యానా 23-23తో స్కోరు సమం చేసింది. అక్కడి నుంచి మ్యాచ్ హోరాహోరీగా సాగి చివరికి టైగా ముగిసింది.