పూణే: టీమిండియా కెప్టెన్గా తాను ఎంతో ఎంజాయ్ చేశానని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెప్పాడు. అన్ని ఫార్మాట్లకు ఒక్క కెప్టెన్ ఉంటేనే జట్టుకు ప్రయోజనం కలుగుతుందని, అందుకే తాను వన్డే జట్టు కెప్టెన్గా తప్పుకున్నానని ఆయన చెప్పారు. ఆయన శుక్రవారం పూణేలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
నిజానికి 2015లో జరిగిన దక్షిణాఫ్రికా సిరీస్ తనకు చివరది అనుకున్నానని ఆయన చెప్పారు. తాను 2007లో కెప్టెన్సీని స్వీకరించినప్పటికీ ఎంతో మార్పు వచ్చిందని అన్నారు. ఇంగ్లాండుతో వన్డే మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జట్టు అవసరం కూడా మారిందని అన్నారు. నిర్దిష్టమైన బ్యాటింగ్ ఆర్డర్ అంటూ తనకేమీ లేదని చెప్పారు.

అగ్రస్థాయి ఆటగాళ్లు బాగా రాణించారని, తనకు ఇచ్చిన బాధ్యతలను నిర్వహించదడానికి తాను తన పాత్రను మలుచుకుంటానని, తాను ఏ స్థానంలో తాను బ్యాటింగ్ చేస్తున్నానో అదే స్థానంలో చేస్తానని చెప్పారు. అన్ని ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ ఉండడం మంచిదని, వేర్వేరు కెప్టెన్లకు తాను వ్యతిరేకమని అన్నారు.
అన్ని ఫార్మాట్లలో జట్టును నడిపించే సత్తా విరాటో కోహ్లీకి ఉందని, అవసరమైతే తాను సలహాలు ఇస్తానని చెప్పారు. ఇకపై తాను బ్యాటింగ్పై దృష్టి పెడుతానని చెప్పారు. మొదటి నుంచి కూడా తాను కోహ్లీ చాలా సన్నిహితంగా మెలుగుతన్నట్లు తెలిపారు. ఎప్పుడు తనను మెరుగుపరుచుకోవాలని కోహ్లీ ప్రయత్నిస్తుంటాడని, తన క్రికెట్ను చాలా మెరుగుపరుచుకున్నాడని ధోనీ అన్నారు.
బాధ్యతలను కూడా బాగా నిర్వహించగలడని, టెస్టుల కన్నా వన్డేలకు నాయకత్వం వహించడం సులభమని, వికెట్ కీపర్గా కోహ్లీకి తాను ఫీడ్ బ్యాక్ ఇస్తానని చెప్పారు. విరాట్ కోహ్లీ కోసం తాను ఏం చేసినా అది జట్టుకు చేసినట్లేనని అన్నాడు. తన జీవితంలో దేనికీ తాను విచారపడలేదని కెప్టెన్సీని వదులుకోవడంపై వేసిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.