ముంబై: దక్షిణాఫ్రికా బౌలర్ ఇమ్రాన్ తాహిర్ ప్రస్తుతం బసచేసిన హోటల్ను విడిచి వెళ్లొద్దంటూ టీమ్ మేనేజ్మెంట్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అయితే, దక్షిణాఫ్రికా టీం మీడియా మేనేజర్ మాత్రం అలాంటిదేమి లేదని చెప్పారు. కాగా, పాకిస్థాన్లో పుట్టిన తాహిర్ ప్రస్తుతం దక్షిణాఫ్రికా తరపున క్రికెట్ ఆడుతున్నాడు.
పాకిస్థాన్తో సిరీస్ నిర్వహించేందుకు గత నెలలో బిసిసిఐ సమావేశమైన నేపథ్యంలో బిసిసిఐ కార్యాలయంపై శివసేన కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాహిర్కు భద్రత పెంచడంతోపాటు ఎలాంటి అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశాలకు వెళ్లొద్దంటూ సూచనలు జారీ చేశారు.
కాగా, మరో వైపు తాహిర్ తన కుటుంబసభ్యులతో ముంబైలోని కొన్ని ప్రదేశాలను సందర్శించేందుకు ప్రణాళికలు వేసుకున్నాడు. అయితే ప్రస్తుతం వాటిని రద్దు చేసుకుంటన్నట్లు తెలిసింది.
ముంబై వేదికగా అక్టోబర్ 30, 31న భారత్ బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టుతో దక్షిణాఫ్రికా రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిన అనంతరం సఫారీలు అక్కడే బస చేశారు. నవంబర్ 5 నుంచి మొహాలి వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే తొలి టెస్ట్ మ్యాచులో 4 టెస్ట్ మ్యాచుల సిరీస్ ప్రారంభం కానుంది.