ఐపీఎల్ 17వ సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. అదిరే వేడుకులు, స్టార్స్ రీఎంట్రీలు, వావ్ అనిపించే క్యాచ్లు, ఊపిరిబిగ్గపట్టే ఉత్కంఠతో ఐపీఎల్ మజా మొదలైంది. చెపాక్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై చెన్నై సూపర్ కింగ్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన సీఎస్కే ఘనంగా బోణీ కొట్టింది.
అయితే మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఆర్సీబీ పనైపోయింనుకునే తరుణంలో అనుజ్ రావత్ (48; 25 బంతుల్లో), దినేశ్ కార్తీక్ (38*; 26 బంతుల్లో) గొప్ప పోరాటం చేశారు. డుప్లెసిస్ (35; 23 బంతుల్లో) అందించిన అదిరే ఆరంభానికి అర్థవంతంగా వారిద్దరు ఇన్నింగ్స్ను ముగించారు. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. ముస్తాఫిజుర్ (4/29) నాలుగు వికెట్లతో సత్తాచాటాడు.

అనంతరం ఛేదనలో చెన్నై 18.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. సీఎస్కేకు శుభారంభం దక్కింది. రచిన్ రవీంద్ర (37; 15 బంతుల్లో) దూకుడుతో పవర్ప్లేలో సీఎస్కే 62 పరుగులు చేసింది. కానీ స్వల్పవ్యవధిలోనే వికెట్లు కోల్పోవడం, శివమ్ దూబె (34*; 28 బంతుల్లో) తొలుత నిదానంగా ఆడటంతో మ్యాచ్ ఆర్సీబీ వైపుకు మళ్లింది. కానీ దూబె గేర్ మార్చి జడేజా (25; 17 బంతుల్లో)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
అయితే ఈ మ్యాచ్తో ధోనీ నుంచి రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. మరోవైపు ఆర్సీబీ సారథి డుప్లెసిస్. కానీ కెమెరామెన్ కెప్టెన్లపై కాకుండా ధోనీ, కోహ్లిపై ఫోకస్ చేశారు. కెమెరామెన్ డుప్లెసిస్పై కొన్నిసార్లు కరుణించినా, రుతురాజ్ను అసలు పట్టించుకోలేదు. ధోనీ కదలికలపైనే దృష్టి పెట్టారు. దీంతో మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కెమెరా సిబ్బందిని ఉద్దేశించి సరదా వ్యాఖ్యలు చేశాడు. అప్పుడుప్పుడు కెప్టెన్ ముఖాన్ని కూడా చూపించడ్రా అంటూ సటైర్ వేశాడు.
జియో సినిమాలో వ్యాఖ్యతగా ఉన్న సెహ్వాగ్ తన సెన్స్ ఆఫ్ హ్యుమర్ను మరోసారి చూపించాడు. ''బ్రదర్.. దయచేసి రుతురాజ్ ముఖాన్ని కూడా చూపించండి. అతడు సీఎస్కే కెప్టెన్. కెమెరామెన్ ధోనీ ఫేస్ మాత్రమే చూపిస్తున్నాడు'' అని సెహ్వాగ్ అన్నాడు. కాగా, ఇవాళ రెండు మ్యాచ్లు ఉన్నాయి. పంజాబ్ కింగ్స్తో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్తో సన్రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి.