హైదరాబాద్: 2007 నుంచి తన పట్ల ప్రేమాభిమానాలను కురిపిస్తున్న ఫ్యాన్కు మహేంద్ర సింగ్ ధోని ధన్యవాదాలు తెలిపాడు. ముంబైలోని బ్రాబోర్న్ స్టేడియంలో మంగళవారం కెప్టెన్గా ఇంగ్లాండ్ జట్టుతో ధోని తన ఆఖరి మ్యాచ్ ఆడుతున్నాడు.
ధోనిని కెప్టెన్గా చివరిసారి చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు బ్రాబోర్న్ స్టేడియానికి పోటెత్తారు. టాస్ కోసం మైదానం లోపలికి వచ్చిన ధోనికి అభిమానులు సాదరంగా స్వాగతించారు. ఈ మ్యాచ్లో ధోని టాస్ ఓడిపోయాడు. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
టాస్ అనంతరం ధోని మాట్లాడుతూ అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. 2007 నుంచి తన వెన్నంటే ఉండి తనను నడిపించారని ఈ సందర్భంగా ధోని చెప్పాడు. వార్మప్ మ్యాచ్కి కూడా పెద్ద ఎత్తున అభిమానులు రావడం తన పట్ల ఉన్న ప్రేమను చూపిస్తోందని ధోని అన్నాడు.

ఇది ఓ అద్భుతమైన ఫీలింగ్ అని ధోని అన్నాడు. మంగళవారం మధ్యాహ్నం 1. 30 గంటల నుంచి ఇంగ్లాండ్, భారత్ ఏ జట్ల మధ్య జరిగే మ్యాచ్కు చివరిసారిగా ధోని కెప్టెన్గా వ్వవహరిస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 15న మొదలయ్యే వన్డే సిరీస్కు సన్నాహకంగా భారత్ ఏ, ఇంగ్లాండ్ లెవెన్ జట్లు రెండు ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడుతున్నాయి.
మంగళవారం జరిగే తొలి డే/నైట్ మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్గా వ్యవహరిస్తుండగా, గురువారం ఇదే స్టేడియంలో జరిగనున్న మ్యాచ్కి అజింక్యా రహానె భారత ఏ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఇయాన్ మోర్గాన్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు ఈ వార్మప్ మ్యాచ్ బరిలోకి దిగుతోంది.
దీనిలో భాగంగా ఈ మ్యాచ్కు హాజరయ్యే అభిమానులకు ఫ్రీ ఎంట్రీ కల్పించనున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. సుమారు పది వేల మంది అభిమానులకు ఉచిత పాస్ లను ఇవ్వనున్నట్లు తెలిపింది. అయితే మ్యాచ్ ప్రారంభమైన తర్వాత కూడా అభిమానుల్ని ఉచితంగానే స్టేడియంలోకి అనుమతించనున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
ఫ్రీగా ఆటను చూసేవారికి కేటాయించిన నార్త్, ఈస్ట్ స్టాండ్లు నిండిపోతే మధ్యాహ్నం 3 గంటలకు గేట్లను మూసివేయనున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత క్రికెట్కు కెప్టెన్గా ఎన్నో చిరస్మరణీయ విజయాలనందించిన ధోనిని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ) జ్ఞాపికతో సత్కరించింది.