
హైదరాబాద్: భారత తాత్కాలిక కెప్టెన్ అజింక్యా రహానేపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్తో రెండు రోజుల్లోనే ముగిసిన చారిత్రక టెస్ట్లో భారత్ ఘనవిజయం సాధించింది. బౌలర్ల విజృంభణతో ఆఫ్ఘన్ ఒకే రోజు రెండుసార్లు ఆలౌట్ అయ్యి భారీ ఓటమి చవి చూసిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ముగిసిన తర్వాత కప్ అందుకున్న కెప్టెన్ రహానే సహచర ఆటగాళ్లతో కలిసి ఫొటోలు ఫోజిచ్చేందుకు సిద్ధమయ్యారు.
ఇంతలోనే పక్కనే ఉన్న ఆఫ్ఘన్ క్రికెటర్లతో పాటు ఆ దేశ క్రికెట్ బోర్డు అధికారులను రహానే సాదరంగా ఆహ్వానించాడు. తమతో పాటు కలిసి పాల్గొనవల్సిందిగా కోరి క్రీడా స్ఫూర్తిని చాటాడు. దీనికి సమ్మతించిన ఆఫ్ఘన్ ఆటగాళ్లు..ట్రోఫీతో కలిసి ఫొటోలు దిగారు. దీన్ని బీసీసీఐ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా పంచుకుంది. అందరూ కలిసి ట్రోఫీతో పొజిద్దామంటూ ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను ఆహ్వానించడం రహానే క్రీడా స్ఫూర్తికి నిదర్శనం. ఇది మరో టెస్ట్ ఆడటం కన్నా ఎక్కువ అని బీసీసీఐ ట్వీట్ చేసింది.
దీనికి స్పందించిన క్రీడా మంత్రి రాజ్యవర్ధన్ సింగ్, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్లు తమ అభినందనలు వ్యక్తం చేశారు. అయితే ఈ విజయంపై రహానె ఇలా స్పందించాడు. 'అఫ్ఘనిస్థాన్ జట్టు బాగా కృషి చేసింది కాబట్టే ఇంతటి వరకూ రాగలిగింది. ఆ జట్టు బౌలింగ్లో మంచి ప్రతిభను కనబరిచింది.' అని పేర్కొన్నాడు.
కాగా, ఈ సిరీస్లో శిఖర్ ధావన్ను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. 96 బంతులు ఆడిన ధావన్ 107 పరుగులు చేశాడు. క్రికెట్ అనేది ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకోవాల్సిన ఆట. ఒకసారి అఫ్ఘనిస్థాన్ జట్టు విజయం పొందిందంటే వరుసగా రికార్డులు మోగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు.