లాహోర్: ప్రపంచకప్ టోర్నమెంట్లో భాగంగా ఇంగ్లండ్లోని మాంఛెస్టర్ ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో భారత్తో జరిగిన మ్యాచ్లో అత్యంత అవమానకంగా పాకిస్తాన్ జట్టు ఓడిపోయిందని మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ ఆరోపించారు. కనీసం ప్రతిఘటించకుండా చేతులెత్తేసిందని విమర్శించారు. మ్యాచ్ ఏకపక్షంగా సాగడానికి పాకిస్తాన్ క్రికెటర్ల వైఖరే కారణమని చెప్పారు.
పాకిస్తాన్ క్రికెట్ జట్టులో పోరాట స్ఫూర్తి కొరవడిందని ఆయన వాపోయారు. జట్టు క్రికెటర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వదల కూడదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కమ్రాన్ అక్మల్ డిమాండ్ చేశారు. దీనిపై ఆయన పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్కు లేఖ రాశారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఆ దేశ క్రికెట్ బోర్డుకు ప్రధాన పోషకుడిగా కూడా వ్యవహరిస్తారు. ఆ హోదాలో క్రికెటర్లపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
ప్రపంచకప్లో అత్యధిక స్కోరు సాధించిన ఆసీస్: ఒకటి కాదు, రెండు కాదు..!
సహజ సిద్ధమైన క్రికెటర్లు తమ దేశంలో ఉన్నారని, వారిలోని ప్రతిభను వెలికి తీయడంలో క్రికెట్ బోర్డు ప్రతీసారి విఫలమౌతూనే వస్తోందని అన్నారు. దీని ప్రభావం వల్లే ఈ దారుణ ఓటమిని చవి చూడాల్సి వచ్చిందని చెప్పారు. జట్టులో జవాబుదారీతనం, పోరాట స్ఫూర్తి కొరవడిందని విమర్శించారు. ప్రతిభ ఆధారంగా జాతీయ క్రికెట్ జట్టును ఎంపిక చేయాల్సి ఉండగా.. దీనికి భిన్నంగా పరిస్థితి నెలకొందని అన్నారు. ప్రతిభ ఆధారంగా ఎంపికైన క్రికెటర్ల వల్ల జట్టు పురోగమిస్తుందని, అద్భుత విజయాలను నమోదు చేస్తుందని కమ్రాన్ అక్మల్ చెప్పారు.
ప్రపంచకప్ టోర్నమెంట్లలో ప్రత్యర్థి జట్టు విధించిన లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చినప్పుడు జట్టు ప్రతీసారి చతికిల పడిందని, జట్టులో పోరాట స్ఫూర్తి కొరవడిందనడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. తొలిసారి బ్యాటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా పరిస్థితిలో మార్పేమీ లేదని, దీనికి నిదర్శనం వెస్టిండీస్పై 105 పరుగులు చేయడమేనని ఆయన ఉదహరించారు.