Imran Khan: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్థాన్ పేలవ ప్రదర్శన తర్వాత జైలు శిక్ష అనుభవిస్తున్న పాక్ మాజీ ప్రధాని, జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ జట్టు ప్రదర్శన పట్ల తాను అసంతృప్తిగా ఉన్నానన్నాడు. న్యూజిలాండ్, భారత్ ల చేతిలో ఘోర పరాజయాలను చవిచూసిన తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించిన మొదటి జట్టుగా ఆతిథ్య పాకిస్థాన్ జట్టు నిలిచింది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ తన సోదరి అలీమాతో మాట్లాడుతూ.. భారత్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోవడం పట్ల తన బాధను వ్యక్తం చేశాడు.
1992లో ప్రపంచ కప్ టైటిల్ గెలుచుకున్న పాకిస్థాన్ జట్టుకు నాయకత్వం వహించిన ఇమ్రాన్ ఖాన్.. పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ క్రికెట్ అర్హతలను ప్రశ్నించాడని అలీమా రావల్పిండి జైలు బయట మీడియాతో వెల్లడించారు. భారత్ తో జరిగిన మ్యాచ్ లో పాక్ ఓటమిపై విచారం వ్యక్తం చేశారని ఆమె వెల్లడించారు. నిర్ణయాలు తీసుకునే హక్కును తనకు ఇష్టమైన వ్యక్తులకు ఇస్తే.. చివరకు పాకిస్థాన్ క్రికెట్ చివరికి నాశనం అవుతుందని ఇమ్రాన్ ఖాన్ చెప్పారని తెలిపారు. క్రికెటర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ఇమ్రాన్ ఖాన్ కూడా భారత్-పాక్ మధ్య జరిగిన మ్యాచ్ ను వీక్షించారని అలీమా చెప్పారు.
