న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రముఖ రాజకీయ నేత ఇమ్రాన్ ఖాన్.. ఇటీవల భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీని కలసిన సమయంలో తన మనసులోని మాటను వ్యక్తికరించారు. భారత్, పాక్ క్రికెట్పై తన కోరికను తెలియజేశారు.
అయితే, ఇమ్రాన్ కోరికకు ప్రధాని నరేంద్ర మోడీ నవ్వే సమాధానంగా దొరికింది. ఇమ్రాన్ ఖాన్ ఏమని కోరారంటే.. చాలా కాలంగా భారత్, పాక్ దేశాల మధ్య క్రికెట్ సిరీస్ జరగలేదని, ఇరు దేశాల మధ్యా క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించాలని విన్నవించారు.
కాగా, మోడీ.. ఖాన్కు ఎలాంటి సమాధానమూ చెప్పలేదని, ఈ ఘటన ఐసీసీ వరల్డ్ ట్వంటీ20 పోటీలు సాగుతున్న సమయంలో జరిగిందని 'హిందుస్థాన్ టైమ్స్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

ఈ విషయాన్ని ఇమ్రాన్ ఖాన్ స్వయంగా వెల్లడిస్తూ.. 'ఇరు(భారత్, పాక్) దేశాల మధ్యా టూర్ సాగాలని కోరాను. మోడీతో అది నా తొలి సమావేశం. ఒకవేళ రెండోసారి కలిస్తే, భారత విదేశాంగ విధానం అపరిపక్వంగా ఉందని చెబుతాను' అని అన్నారు. ఉగ్రదాడుల కారణంగా క్రికెట్ సంబంధాలను తెంచుకోవడం సరైన పని కాదని చెప్పారు.
కాగా, 2007 నుంచి ఇరుదేశాల మధ్యా ఒక్క ద్వైపాక్షిక సిరీస్ కూడా జరగలేదన్న సంగతి తెలిసిందే. (2012/13లో మాత్రం పాక్ జట్టు భారత పర్యటనకు రాగా షార్ట్ సిరీస్ జరిగింది) వరల్డ్ కప్ వంటి ఐసీసీ నిర్వహించే ప్రధాన టోర్నీల్లో మాత్రమే భారత్, పాక్ తలపడుతున్నాయే తప్ప ద్వైపాక్షిక పోటీలు, రెండు దేశాల మధ్యా పర్యటనలు మాత్రం నిలిచిపోయాయి.