వైభవ్ సూర్యవంశీకి లలిత్ మోదీ బంపరాఫర్!
ఐపీఎల్ 2026 సీజన్ తుది అంకానికి చేరుకున్న వేళ సరికొత్త రికార్డులతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యంతో క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ ప్రశంసలతో ముంచెత్తాడు.ఐపీఎల్ చరిత్రలోనే వైభవ్ అత్యుత్తమ కొనుగోలు అంటూ ఆయన కొనియాడారు. గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్లో వైభవ్ కేవలం 47 బంతుల్లో 7 భారీ సిక్సర్లు, 8 ఫోర్ల సహాయంతో 96 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి అందరినీ మంత్రముగ్ధులను చేశాడు.
ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓడిపోయినప్పటికీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్ చూసి లలిత్ మోదీ పూర్తిగా ముగ్ధుడయ్యాడు. ఈ నేపథ్యంలోనే ఆయన ఎక్స్ వేదికగా ఓ సుదీర్ఘమైన, ఎంతో భావోద్వేగభరితమైన పోస్ట్ను పంచుకున్నారు. వైభవ్ అసాధారణ ఆటతీరును అభినందిస్తూనే, అతనికి ఎవరూ ఊహించని ఓ బంపర్ ఆఫర్ను ప్రకటించారు. ప్రపంచంలో ఎక్కడైనా సరే, తనకు నచ్చిన దేశంలో ఉచితంగా ఉన్నత విద్యను అభ్యసించేలా వైభవ్కు పూర్తి విద్యా స్కాలర్షిప్ ఇస్తానని లలిత్ మోదీ సంచలన ప్రకటన చేశారు.

లలిత్ మోదీ తన ట్వీట్లో వైభవ్ సూర్యవంశీ ప్రతిభను ప్రత్యేకంగా ప్రస్తావించారు. "ఈ రోజు వైభవ్ సూర్యవంశీ తన సెంచరీకి కేవలం 4 పరుగుల దూరంలో నిలిచిపోయి ఉండవచ్చు. కానీ నా దృష్టిలో అతను అంతకంటే పెద్ద విజయాన్ని, మైలురాయిని సాధించాడు. చిన్న వయసులోనే ఎలాంటి భయం లేకుండా మైదానంలోకి దిగి ఎలా ఆడవచ్చో అతను దేశం మొత్తానికి నిరూపించాడు" అని పేర్కొన్నారు. క్రీడలు అనేవి కేవలం వినోదం కోసమే కాదని, యువతకు సరికొత్త అవకాశాలను సృష్టించే వేదికలని తాను ఎప్పుడూ నమ్ముతానని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని లలిత్ మోదీ స్పష్టం చేశారు.
ఈ ఆఫర్ కింద ప్రపంచంలోని ఏ మూలలో ఉన్న ఏ ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం లేదా కాలేజీలోనైనా వైభవ్ చదువుకోవాలని అనుకుంటే దానికి అయ్యే పూర్తి ఖర్చులను తానే స్వయంగా భరిస్తానని లలిత్ మోదీ ప్రకటించారు. ఈ స్కాలర్షిప్ వైభవ్ స్టేడియంలో చేసిన పరుగుల కోసం మాత్రమే ఇవ్వడం లేదని.. కోట్లాది మంది యువ భారతీయులకు వైభవ్ అందించిన ధైర్యం, ఆత్మవిశ్వాసం, గొప్ప స్ఫూర్తికి గుర్తింపుగా ఇస్తున్నానని వెల్లడించారు. ప్రతిభ గల ఏ యువకుడైనా చదువుకు, క్రీడల్లో ఉన్నత శిఖరాలను అందుకోవడానికి మధ్య ఏదో ఒకదాన్నే ఎంచుకోవాల్సిన దురదృష్టకర పరిస్థితి రాకూడదన్నదే తన తాపత్రయమని లలిత్ మోదీ ఆకాంక్షించారు.
ఈ 15 ఏళ్ల యువ సంచలనానికి ఐపీఎల్ 2026 సీజన్ నిజంగా ఓ మధురమైన కలలా సాగింది. ఈ టోర్నీలో ఆడిన 16 మ్యాచ్ల్లో వైభవ్ ఏకంగా 776 పరుగులు సాధించి, అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా 'ఆరెంజ్ క్యాప్'ను తన వశం చేసుకున్నాడు. మరీ ముఖ్యంగా ఈ టోర్నీలో వైభవ్ స్ట్రైక్ రేట్ 230కి పైగా ఉండటం క్రికెట్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. సీజన్ అంతటా ఎలాంటి ఒత్తిడి లేకుండా, క్లిష్ట పరిస్థితుల్లోనూ జట్టును ఆదుకుంటూ భయం లేకుండా బ్యాటింగ్ చేసిన వైభవ్.. దురదృష్టవశాత్తూ క్వాలిఫైయర్-2 మ్యాచ్లో తన జట్టును ఫైనల్కు చేర్చలేకపోయినా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది క్రికెట్ అభిమానుల హృదయాలను మాత్రం గెలుచుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications