హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డులను బద్దలు కొట్టడం అసాధ్యమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. ధోని నుంచి పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తొలి వన్డేలో సంచలన విజయాన్ని నమోదు చేసిన కోహ్లీ బీసీసీఐ వెబ్సైట్కి ఇంటర్యూ ఇచ్చాడు.
ఈ ఇంటర్యూలో కోహ్లీని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ పలు ఆసక్తికర విషయాలు అడిగారు. పూణే వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన తొలి వన్డేలో 351 పరుగుల విజయ లక్ష్యాన్ని చేధించడం సంతోషంగా ఉందని కోహ్లీ ఈ సందర్భంగా తెలిపాడు.

తన జీవితంలో ఎక్కువ మంది ఆప్తులు లేకపోవడం కూడా తన ఎదుగుదలకు ఎంతగానో సాయపడిందని చెప్పుకొచ్చాడు. జీవితంలో బ్యాలెన్స్ ఏర్పరచుకొని ముందుకు సాగిపోవాలని అన్నాడు. 'అదృష్టవశాత్తూ నా జీవితంలో ఎక్కువ మంది సన్నిహితులు లేరు. అది నాకు సాయపడిందని అనుకుంటాను. మనం మాట్లాడాల్సిన స్నేహితులు, జనాలు ఎక్కువమంది ఉండటం ఆటకు భంగం కలిగిస్తుంది. టైమ్ మేనేజ్మెంట్ కష్టమవుతుంది' అని అన్నాడు.
ఎవరైనా సరే వారి లక్ష్యానికి పరిమితులు విధించుకోవద్దని కోహ్లీ చెప్పాడు. 'కొన్నిసార్లు మనకు తెలీకుండా మన లక్ష్యానికి పరిమితులు విధించుకొంటాం. నేనలా చేయను. నేనెప్పుడూ నా సామర్థ్యాన్ని బాగా ప్రదర్శించాలని కోరుకుంటాను. సమయ నిర్వహణకు వచ్చేసరికి అప్రాధాన్యమైన అంశాల్ని వదిలేస్తాను. నా జీవితంలో సాధించాల్సిన దానిపై ఎప్పుడూ పరిమితులు పెట్టుకోను' అని పేర్కొన్నాడు.
భారత క్రికెట్ ఆశలను ఓ గ్లోబల్ ఐకాన్గా సచిన్ ఎలాగైతే తీసుకెళ్లారో ఇప్పుడు నీ వంతు వచ్చింది అన్న ప్రశ్నకు గాను కోహ్లీ స్పందించాడు.
సచిన్ టెండూల్కర్ సాధించిన రికార్డులను అందుకోవడం చాలా కష్టమైన పనిగా పేర్కొన్నాడు. 'నేను అంతకాలం (24 ఏళ్లు) ఆడకపోవచ్చు. 200 టెస్టులు, 100 సెంచరీలు అనేవి మంచి సంఖ్యలు. వాటిని సాధించడం అసాధ్యం! కానీ.. క్రికెట్పై చెరగని ముద్ర వేస్తానని మాత్రం నేనెప్పుడూ బలంగా నమ్ముతా' అని కోహ్లి చెప్పాడు.
విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 42 అంతర్జాతీయ సెంచరీలు సాధించాడు. అందులో వన్డేల్లో 27, టెస్టుల్లో 15 ఉన్నాయి. భారత క్రికెట్ను వైవిధ్యంగా తప్పక ముందుకు తీసుకెళ్తానని చెప్పాడు. సాధించేందుకు అసాధ్యం అనేది ఏదీ లేదని, ప్రస్తుత రోజుల్లో వంద వందలు సాధించేందుకు కాస్తంత సమయం పడుతుందని చెప్పాడు.