టీమిండియా మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు. టీమిండియాను, భారత ప్లేయర్లను విమర్శించే ప్రత్యర్థి మాజీ క్రికెటర్లకు తన స్టైల్ లో నెట్టింట్లో చురకలు అట్టిస్తుంటాడు. అలాగే మ్యాచ్ ఫలితాలు, ప్లేయర్ల ఫామ్ గురించి విశ్లేషిస్తుంటాడు.
అయితే తాజాగా జాఫర్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఐపీఎల్ వేలం ముందు దాని గురించి ఒకసారి ఆలోచించడం అని ఇండైరెక్ట్ గా మెన్షన్ చేశాడు. దుబాయ్ వేదికగా డిసెంబర్ 19న ఐపీఎల్ వేలం జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన గురించి ఆలోచించాలని జాఫర్ ట్వీట్ చేశాడు.

''ఐపీఎల్ లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన తొలిగించాలి. దీనివల్ల ఆల్ రౌండర్లను ఎక్కువగా ప్రోత్సహించట్లేదు. అందుకే ఆల్ రౌండర్లు, బ్యాటర్లు మెరుగ్గా బౌలింగ్ చేయలేకపోతున్నారు. ఇది భారత క్రికెట్ కు సమస్యగా మారుతోంది'' అని జాఫర్ ట్వీట్ చేశాడు.
ఇటీవల సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర జాక్వెస్ కలిస్ కూడా ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పాడు. ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల ఆల్రౌండర్స్ జట్టులో చోటు కోల్పోతున్నారని అన్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్ తో జట్టులో 12 మంది అవుతున్నారని, ఆల్రౌండర్ ప్రాముఖ్యత తగ్గుతుందని కలిస్ చెప్పాడు. ఇప్పుడు ఇదే తరహా అభిప్రాయాన్ని జాఫర్ కూడా వ్యక్తం చేశాడు.
ప్రస్తుత టీమిండియాలో స్టార్ ఆల్ రౌండర్లుగా హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా మాత్రమే ఉన్నారు. అక్షర్ పటేల్ ఫర్వాలేదనిపిస్తున్నాడు. మిగిలిన వారిలో బ్యాటింగ్ లేదా బౌలింగ్ విభాగాల్లో ఏదో ఒకటి మాత్రమే ఎఫెక్టివ్ గా రాణిస్తున్నారు. అలాగే బ్యాటర్లలో పార్ట్ టైమ్ బౌలింగ్ చేసే ప్లేయర్లు లేకపోవడం టీమిండియాకు ప్రధాన సమస్యగా మారింది. ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్ లో హార్దిక్ గాయంతో టీమిండియాకు ఆరో బౌలర్ ఆప్షన్ లేకుండా పోయింది.