
వచ్చే ఏడాది ఐపీఎల్ నుంచి కొత్త రూల్ ప్రవేశపెడుతున్నట్లు బీసీసీఐ ఇటీవలే ప్రకటించింది. ఈ నిబంధన ప్రకారం ఆట ఆరంభానికి ముందే ప్రతి జట్టు నలుగురు సబ్స్టిట్యూట్ ఆటగాళ్లను ఎంచుకుంటుంది. ఆ తర్వాత ఆడుతున్న 11 మందిలో ఒకరి స్థానంలో ఈ సబ్స్టిట్యూట్లలో ఒకరిని తీసుకోవచ్చు. వాళ్లు వట్టి సబ్స్టిట్యూట్లా కాకుండా పూర్తి ప్లేయర్లా ఆడతారు. అంటే సదరు సబ్స్టిట్యూట్ ఆటగాడు బ్యాటింగ్, బౌలింగ్ కూడా చేసే అవకాశం ఉంది.
ఈ నిబంధనను 'ఇంపాక్ట్ ప్లేయర్' అని పిలుస్తున్నారు. ఈ రూల్ తీసుకొస్తున్నట్లు ధ్రువీకరించిన బీసీసీఐ.. త్వరలోనే దీనికి సంబంధించిన సూచనలను ఫ్రాంచైజీలకు వెల్లడిస్తామని చెప్పింది. ఈ క్రమంలోనే తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ 'ఇంపాక్ట్ ప్లేయర్' నిబంధన కేవలం భారతీయ ఆటగాళ్లకు మాత్రమే వర్తిస్తుందని తేల్చి చెప్పింది. అంటే జట్టులో ఉన్న ఒక భారతీయ ఆటగాడి స్థానంలో విదేశీ ప్లేయర్ను ఆడించడానికి కుదరదు. అలాగే మరో విదేశీ ఆటగాడి స్థానంలో కూడా మరో విదేశీ ప్లేయర్ను సబ్స్టిట్యూట్ చేయడానికి వీల్లేదు.
ఒక జట్టులో అత్యధికంగా నలుగురు మాత్రమే విదేశీ ఆటగాళ్లు ఉండాలనే నిబంధనను ఎవరూ ఉల్లంఘించకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే, కావాలంటే విదేశీ ఆటగాళ్ల స్థానంలో సబ్స్టిట్యూట్గా భారతీయ ఆటగాడిని తీసుకోవచ్చు కానీ.. మరో విదేశీ ప్లేయర్ను తీసుకోవడానికి వీల్లేదు. తద్వారా అదనంగా ఐదో విదేశీ ప్లేయర్ను ఆడించే అవకాశం ఫ్రాంచైజీలకు ఉండదు.
'ఇంపాక్ట్ ప్లేయర్' నిబంధన వల్ల ఫ్రాంచైజీలు బాగా లాభపడే అవకాశం ఉంది. ఛేజింగ్ సమయంలో స్పెషలిస్టు బ్యాటర్ను, లక్ష్యాన్ని కాపాడుకోవాలంటే స్పెషలిస్ట్ బౌలర్ను సబ్స్టిట్యూట్ చేసుకునే వీలుంటుంది. అయితే దీని వల్ల ఆల్రౌండర్ల పాత్ర ప్రాముఖ్యత తగ్గిపోతుందని కొందరు అంటున్నారు. ఈ నిబంధనను ఇటీవలే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బీసీసీఐ అమలు చేసిన సంగతి తెలిసిందే.