
కరాచి: నా ప్రతిభ ఆధారంగానే జాతీయ జట్టుకు ఎంపికయ్యా. ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని పాకిస్థాన్ యువ ఆటగాడు ఇమామ్ ఉల్ హక్ కోరాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్ క్రికెట్లో 23 ఏళ్ల ఇమామ్ ఉల్ హక్ ఇటీవలి కాలంలో మంచి ఫామ్ కనబరుస్తున్నాడు. ప్రపంచకప్ 2019లో కూడా రాణించాడు. 2017లో పాక్ వన్డే జట్టులోకి అరంగేట్రం చేసిన ఇమామ్ 36 వన్డేలాడి 54 సగటుతో పరుగులు చేసాడు.
ఇమామ్ టెస్టుల్లో రాణించలేకపోతున్నాడు. పది టెస్టుల్లో 28.41 సగటుతో 483 పరుగులు మాత్రమే చేయడంతో ఇమామ్పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే ఇమామ్ రాణిస్తున్నా.. పాక్ దిగ్గజ క్రికెటర్ ఇంజమామ్ ఉల్ హక్ మేనల్లుడిగానే అతన్ని అందరూ పరిగణిస్తారు. దీంతో ఇమామ్ అసహనానికి గురవుతున్నాడు. తాజాగా ఇమామ్ ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. 'పాకిస్థాన్ అభిమానులు తననెప్పటికీ ఇంజమామ్ మేనల్లుడిగానే పరిగణిస్తారు. తన ప్రతిభ వల్లే జట్టులోకి వచ్చాననే విషయాన్ని మాత్రం వారు అంగీకరించరు. ఇంజమామ్ పేరుతో గుర్తించడం కన్నా.. ఇమామ్ ఉల్ హక్ పేరుతో గుర్తించడమే నాకు నచ్చుతుంది' అని ఇమామ్ తెలిపాడు.
'గతంలో పాకిస్థాన్ జట్టుకు చీఫ్ సెలక్టర్గా ఉన్న ఇంజమామ్.. అప్పటి కోచ్ మిక్కీఆర్థర్పై ఒత్తిడి తేవడం వల్లే తనని ఎంపిక చేశారనే అభిప్రాయం పాక్ అభిమానుల్లో ఉంది. నా ప్రతిభ ఆధారంగానే జాతీయ జట్టుకు ఎంపికయ్యా. ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో మీడియాకి తెలవకుండా ఏమీ జరగదు, సెలక్షన్ ప్రక్రియలో తాను ఎదుర్కొన్న సవాళ్లను ఎవరూ చూడలేదు. కేవలం ఇంజమామ్ అల్లుడిగా మాత్రమే భావించి తనపై విమర్శలు చేస్తున్నారు' అని ఇమామ్ మండిపడ్డాడు. పాకిస్థాన్ జట్టు ఓడిపోయినప్పుడు ఏడుస్తా. ఎవరైనా బాబర్ అజామ్, మహ్మద్ అమిర్లను విమర్శిస్తే బాధపడతా అని ఇమామ్ పేర్కొన్నాడు.
ప్రతుతం పాకిస్థాన్, శ్రీలంక మధ్య సిరీస్ జరుగుతోంది. ఉగ్రదాడి తర్వాత లంక మొదటిసారి పాకిస్థాన్లో అడుగుపెట్టింది. ఇరు జట్ల మధ్య శుక్రవారం జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండా రైద్దెన విషయం తెలిసిందే. ఐతే ఇదే వేదికగా ఆదివారం జరగాల్సిన రెండో వన్డేకు కూడా వరుణుడి ముప్పు పొంచి ఉండటంతో.. ముందు జాగ్రత్తగా మ్యాచ్ షెడ్యూల్లో మార్పులు చేశారు. షెడ్యూల్ ప్రకారం ఆదివారం జరగాల్సిన రెండో వన్డే సోమవారం (సెప్టెంబర్ 30) జరుగుతుందని ఐసీసీ ట్విటర్ వేదికగా వెల్లడించింది. మూడు వన్డేల సిరీస్లో ఫైనల్ వన్డే కూడా కరాచీలోనే జరగనుంది. అనంతరం మూడు టీ20ల సిరీస్కు లాహోర్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.