హైదరాబాద్: శ్రీలంకతో వన్డే సిరిస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టుని పాకిస్థాన్ సెలక్టర్లు శుక్రవారం ప్రకటించారు. ఈ జట్టులో ఆ దేశ మాజీ క్రికెటర్, ప్రస్తుత చీఫ్ సెలక్టర్ ఇంజిమామ్ ఉల్ హక్ మేనల్లుడు ఎంపికయ్యాడు.
ఈ ఏడాది జూన్లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన పాక్ జట్టులో ఒకే ఒక్క మార్పుతో జట్టుని ఎంపిక చేశారు. ఫిట్నెస్ లేని కారణంగా మాజీ కెప్టెన్ అజహర్ అలీని తప్పించి.. అతని స్థానంలో ఇంజిమామ్ మేనల్లుడు ఇమామ్ ఉల్ హక్ సెలక్టర్లు చోటు కల్పించారు.
ఈ ఎంపిక ఇప్పుడు పాకిస్థాన్లో పెద్ద దుమారం లేపుతోంది. దీనిపై పాకిస్థాన్ సెలక్షన్ కమిటీ వివరణ ఇచ్చింది. 'అజహర్ అలీ కాకుండా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిన జట్టునే ఎంపికే చేశాం. మోకాలి గాయం నుంచి అజహర్ అలీ పూర్తిగా కోలుకునేందుకే అతనికి శ్రీలంకతో సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చాం' అని సెలక్టర్లు మీడియాతో చెప్పారు.
21 ఏళ్ల ఇమామ్ ఉల్ హక్ 31 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు మాత్రమే ఆడాడు. దేశవాళీ క్రికెట్లో అసమాన ప్రతిభ కనబర్చినందుకే అతడ్ని జట్టులో ఎంపిక చేశామని, మరే కారణంతో కాదంటూ ఇంజిమామ్ ఉల్ హక్ స్పష్టం చేశాడు. అక్టోబరు 13 నుంచి దుబాయ్ వేదికగా శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.