కరాచీ: పలువురు మహిళలతో సంబంధం పెట్టుకుని మోసం చేశాడంటూ ఆన్లైన్లో స్క్రీన్ షాట్లతో వార్తలు వచ్చిన ఘటనపై పాకిస్తాన్ వివాదాస్పద ఓపెనర్ ఇమాముల్ హక్ బేషరతుగా క్షమాపణలు తెలిపాడు. ఎఫైర్ల విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సీరియస్గా అవ్వడంతో ఇమాముల్ క్షమాపణలు తెలియజేశాడు. అంతేకాకుండా పాక్ బోర్డు పెద్దలను క్షమాపణలు కోరాడని పీసీబీ ఎండీ వసీం ఖాన్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 ప్రత్యేక వార్తల కోసం
వసీం ఖాన్ మాట్లాడుతూ... 'ఎఫైర్ల విషయంలో ఇమాముల్ను హెచ్చరించాం. వివరణ కూడా ఇవ్వాలని కోరాం. దీంతో ఇమామ్ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ క్షమాపణలు కోరాడు. అయితే ఇది ఇమాముల్ వ్యక్తిగత విషయం. కానీ.. పాక్ ఆటగాళ్లు క్రమశిక్షణతో అత్యున్నత ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని మేము ఆశిస్తునాం. అందుకే ఇమాముల్ను హెచ్చరించాం. పాక్ జట్టులో ఇలాంటివి మళ్లీ రిపీట్ కావని భావిస్తున్నా' అని వసీం ఖాన్ తెలిపాడు.
పాకిస్థాన్ బ్యాట్స్మన్ ఇమామ్ ఉల్ హక్ అనేక మంది యువతుల్ని మోసం చేశాడంటూ కొన్ని రోజుల క్రితం వార్తలు చక్కర్లు కొట్టాయి. అంతేకాదు ఇమామ్ యువతులతో ఛాటింగ్ చేసిన స్క్రీన్ షాట్లు ట్విటర్లో వైరల్ అయ్యాయి. 'ఇమామ్ తన పలుకుబడి ఉపయోగించి అనేకమంది యువతుల్ని మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతులతో శారీరక సంబంధాలు కూడా కొనసాగించాడని' పాకిస్థాన్కు చెందిన ఓ మీడియా పేర్కొంది. ఐదారు నెలల్లోనే ఇవన్నీ జరిగాయని, ప్రపంచకప్ సమయంలోనూ ఈ వ్యవహారాలను కొనసాగించాడని కూడా పేర్కొంది. దీంతో ఇమాముల్పై పీసీబీ సీరియస్ అయింది.
ప్రపంచకప్ సమయంలో పాక్ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ అబ్దుల్ రజాక్ కూడా వివాదస్పద వ్యాఖ్యలు చేసాడు. పెళ్లి అనంతరం సుమారు ఐదారుగురు అమ్మాయిలతో వివాహేతర సంబంధాలను పెట్టుకున్నా అని బహిరంగంగా వ్యాఖ్యానించాడు. రజాక్, ఇమాముల్ వ్యాఖ్యలు పాక్ జట్టుకు తలనొప్పిగా మారాయి.