డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ అయిదు టైటిళ్లు సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది.16 ఏళ్ల నుంచి ఫేవరేట్గా ఆర్సీబీ బరిలోకి దిగుతున్నా కప్ను ముద్దాడలేకపోతుంది. దీంతో ఓ ఆర్సీబీ వీరాభిమాని మహేంద్ర సింగ్ ధోనీని బెంగళూరు జట్టులోకి రావాలని ఓ ఈవెంట్ వేదికగా కోరాడు.
''ఆర్సీబీకి నేను డైహార్డ్ ఫ్యాన్. 16 ఏళ్ల నుంచి బెంగళూరు జట్టుకే మద్దతు ఇస్తున్నా.సీఎస్కే తరపున అయిదు టైటిళ్లు సాధించారు. అలాగే ఆర్సీబీకి వచ్చి మాకు ఒక్క ట్రోఫీ అందించండి'' అని ధోనీని ఓ అభిమాని అడిగాడు. దీనికి ధోనీ చాలా వివరంగా బదులిచ్చాడు.

'' ఆర్సీబీ మంచి జట్టు. క్రికెట్లో ఏది ప్లాన్ ప్రకారం అసలు జరగదు. ఇక ఐపీఎల్ గురించి మాట్లాడితే.. మొత్తం పది జట్లు బలమైనవే. గాయాల కారణంగా కొంతమంది ప్లేయర్లు దూరమవ్వడమే అసలు సమస్య. ఐపీఎల్లో ఛాంపియన్గా నిలవడానికి ప్రతి జట్టుకు సమాన అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం నా జట్టు విషయాలు గురించి ఆందోళన చెందుతున్నా (నవ్వుతూ)''
'' ఇక ప్రతి టీమ్కు ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేను. నేను చెన్నై జట్టు వీడటానికి ప్రయత్నించడం, వేరే జట్టుకు సపోర్ట్ చేయడం లాంటివి చేస్తే.. ఏం జరుగుతుందో ఒక్కసారి ఊహించుకోంది. మా సీఎస్కే ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతారు?'' అని ధోనీ అన్నాడు.
కాగా, ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో చెన్నె మిచెల్ (రూ.14 కోట్లు), సమీర్ రిజ్వీ (రూ.8.40 కోట్లు), శార్దూల్ (రూ.4 కోట్లు), ముస్తాఫిజుర్ (రూ.2 కోట్లు), రచిన్ రవీంద్ర (రూ.1.80 కోట్లు), అవనీశ్ రావు (రూ.20 లక్షలు)ను కొనుగోలు చేసింది. మరోవైపు బెంగళూరు అల్జారి జోషెఫ్ (రూ.11.50 కోట్లు), యశ్ దయాల్ (రూ.5 కోట్లు), ఫెర్గూసన్ (రూ.2 కోట్లు), టామ్ కరన్ (రూ.1.50 కోట్లు), సౌరభ్ చౌహాన్ (రూ.20 లక్షలు), స్వప్నిల్ సింగ్ (రూ.20 లక్షలు)ను దక్కించుకుంది.