పాకిస్థాన్ క్రికెట్ జట్టులో తనదైన ముద్ర వేసి మాజీ ఆల్రౌండర్ ఇమాద్ వసీం మళ్లీ ఒక ఇంటివాడయ్యాడు. ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, వృత్తిరీత్యా న్యాయవాది అయిన నాయలా రాజాతో ఆయన వివాహం ఘనంగా జరిగింది. అయితే మొదటి భార్య సానియా అష్ఫాక్తో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన కేవలం 2 నెలల వ్యవధిలోనే ఇమాద్ రెండో వివాహం చేసుకోవడం ఇప్పుడు క్రీడా, సామాజిక వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఫిబ్రవరి 16న ఈ జంట తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ విషయం అధికారికంగా ధ్రువీకరించబడింది.
సంచలనం రేపుతున్న విడాకుల నేపథ్యం
ఇమాద్ వసీం తన మొదటి భార్య సానియా అష్ఫాక్ నుండి విడిపోతున్నట్లు గతేడాది డిసెంబర్ 28న అధికారికంగా వెల్లడించాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే ఈ విడాకుల వెనుక పెద్ద వివాదమే నడిచింది. ఇమాద్ మరో మహిళతో ఉన్న సంబంధం కారణంగానే తమ కుటుంబాన్ని వదిలేశారని సానియా అప్పట్లో తీవ్రమైన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా తన మూడో బిడ్డ గర్భంతో ఉన్న సమయంలోనే ఇమాద్ వేరే మహిళతో సాన్నిహిత్యం పెంచుకున్నారని ఆమె సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేయడం అప్పట్లో ప్రకంపనలు సృష్టించింది.

ఎవరీ నాయలా రాజా?
ఇమాద్ రెండో భార్య నాయలా రాజా పాకిస్థాన్లో మంచి గుర్తింపు ఉన్న సోషల్ మీడియా పర్సనాలిటీ. ఇన్స్టాగ్రామ్లో ఆమెకు సుమారు 6.5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఫ్యాషన్, లైఫ్స్టైల్, బ్యూటీ కంటెంట్తో ఆమె నెటిజన్లను ఆకట్టుకుంటూ ఉంటారు. కేవలం ఇన్ఫ్లుయెన్సర్గానే కాకుండా ఆమె ఒక లాయర్ కూడా. గత ఏడాది జూలైలో లండన్లో ఇమాద్, నాయలా కలిసి కనిపించినప్పుడే వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందనే పుకార్లు వచ్చాయి. ఇప్పుడు ఆ ప్రచారం నిజమైంది.
ఇమాద్ వసీం క్రికెట్ కెరీర్
యూకేలో జన్మించి పాకిస్థాన్ తరఫున క్రికెట్ ఆడిన ఇమాద్ వసీం.. పరిమిత ఓవర్ల క్రికెట్లో మేటి ఆల్రౌండర్గా గుర్తింపు పొందారు. తన కెరీర్లో 55 వన్డేలు ఆడి 986 పరుగులు చేయడంతో పాటు 44 వికెట్లు తీశారు. అలాగే 75 టీ20 మ్యాచ్ల్లో 554 పరుగులు చేసి, 73 వికెట్లు పడగొట్టారు. ముఖ్యంగా తక్కువ ఎకానమీ రేటుతో బౌలింగ్ చేయడంలో ఆయన దిట్ట. 2023లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, 2024 టీ20 ప్రపంచకప్ కోసం మళ్లీ జట్టులోకి వచ్చారు. చివరగా డిసెంబర్ 2024లో ఆయన తన రిటైర్మెంట్ను మళ్లీ ఖరారు చేశారు.