దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో ముంబయి ఇండియన్స్కు చెందిన ఎంఐ ఎమిరేట్స్ బోణీ కొట్టింది. గల్ఫ్ జెయింట్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఎమిరేట్స్ అయిదు వికెట్లకు 179 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో గల్ఫ్ జెయింట్స్ తొమ్మిది వికెట్లు కోల్పోయి 161 పరుగులే చేసి ఓటమిపాలైంది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ రెండో ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. విల్ (1) నిరాశపరిచాడు. మహ్మద్ వసీమ్ (19; 18 బంతుల్లో)తో కలిసి ఆండ్రూ ఫ్లెచర్ (28; 38 బంతుల్లో) నిదానంగా బ్యాటింగ్ చేయడంతో ఎమిరేట్స్ రన్రేట్ దారుణంగా పడిపోయింది. అయితే వారిద్దరు ఔటైన అనంతరం నికోలస్ పూరన్ (51; 28 బంతుల్లో), అంబటి రాయుడు (25; 16 బంతుల్లో) చెలరేగారు. వీరిద్దరు ఎడాపెడా బౌండరీలతో స్కోరుబోర్డు పరుగులు పెట్టించారు.

కానీ దూకుడుగా ఆడే క్రమంలో వీరిద్దరు 18వ ఓవర్లో పెవిలియన్కు చేరారు. ఈ దశలో బ్యాటింగ్కు టిమ్ డేవిడ్ విధ్వంసం సృష్టించాడు. 15 బంతుల్లో 41 పరుగులు చేశాడు. రెండు ఫోర్లు, అయిదు సిక్సర్లు బాదాడు. చివరి నాలుగు ఓవరల్లో ఎమిరేట్స్ 58 పరుగులు చేసింది. గల్ఫ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ రెండు వికెట్లు తీశాడు.
అనంతరం ఛేదనలో గల్ఫ్ జెయింట్స్కు శుభారంభం లభించింది. ఓపెనర్లు జెమి స్మిత్ (17; 13 బంతుల్లో), జేమ్స్ విన్స్ (52; 43 బంతుల్లో) తొలి వికెట్కు 48 పరుగులు జోడించారు. కానీ ఎమిరేట్స్ బౌలర్లు క్రమంగా వికెట్లు తీస్తూ గల్ఫ్ను ఒత్తిడిలోకి నెట్టారు. అయితే జెమీ ఓవర్టన్ గొప్పగా పోరాడాడు. 18 బంతుల్లో 41 పరుగులు చేశాడు. కానీ అతడికి ఇతర బ్యాటర్ల నుంచి సహకారం లభించకపోవడంతో గల్ఫ్ ఓటమిపాలైంది. ఎమిరేట్స్ బౌలర్లలో ఫరూకీ నాలుగు వికెట్లతో సత్తాచాటాడు.
కాగా, దుబాయ్ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో రాయుడు నిరాశపరిచిన విషయం తెలిసిందే. ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన రాయుడు 2 బంతుల్లో 1 పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. సికిందర్ రాజా బౌలింగ్లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ మ్యాచ్లో ముంబయి ఎమిరెట్స్ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. కానీ గల్ఫ్పై మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.