Viral Video: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడో వన్డే విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ను భారత్ 9 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు హోటల్కు తిరిగి చేరుకున్న తర్వాత అద్భుతమైన సిరీస్ విజయాన్ని కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. వైజాగ్లో భారత్ తరఫున సెంచరీ సాధించిన యశస్వి జైస్వాల్ కేక్ కట్ చేశాడు.
యశస్వి జైస్వాల్ మొదట విరాట్ కోహ్లీకి కేక్ తినిపించాడు. ఆ తర్వాత యశస్వి రోహిత్ శర్మకు కేక్ తినిపించడానికి వెళ్లగా.. రోహిత్ దాన్ని నిరాకరించాడు. కేక్ వద్దంటూ రోహిత్, "మళ్ళీ లావవుతాను(మోటా హో జావుంగా వాపస్)" అని అన్నాడు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న జట్టు సభ్యులంతా నవ్వారు. ఈ సరదా సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టెస్ట్ రిటైర్మెంట్ తర్వాత రోహిత్ అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్
రోహిత్ శర్మ ఐపీఎల్ 2025 సందర్భంగా టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ 2024లో టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత టీ20ల నుంచి కూడా రిటైర్ అయ్యాడు. వన్డేలలో కొనసాగాలంటే తన ఫిట్నెస్పై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే అక్టోబర్లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్కు ముందు రోహిత్ అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ సాధించాడు. రోహిత్ కనీసం 10 కిలోల బరువు తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు 'హిట్మ్యాన్' గతంలో కంటే సన్నగా మరింత ఫిట్గా కనిపిస్తున్నాడు.
విరాట్-రోహిత్ బ్యాటింగ్ జోరు
దక్షిణాఫ్రికాతో జరిగిన 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ అద్భుతమైన ఫామ్లో కనిపించారు. విరాట్ కోహ్లీ మూడు మ్యాచ్ల సిరీస్లో 2 సెంచరీలు, 1 ఫిఫ్టీతో అత్యధికంగా 302 పరుగులు సాధించాడు. రోహిత్ శర్మ 2 అర్ధ సెంచరీల సహాయంతో మొత్తం 146 పరుగులు చేశాడు.