హైదరాబాద్: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రం 2018 ఏడాదికి గాను పద్మ అవార్డులను ప్రకటించింది. అన్ని రంగాలకు కలిపి మొత్తం 73 మందిని ఈ పద్మ అవార్డులు వరించాయి. వారిలో క్రీడారంగానికి ఆరు రావడం విశేషం. వీరిలో ఇద్దరు భారత జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, ఇంకొకరు తెలుగు తేజమైన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్.
క్రీడా రంగంలో విశిష్ట సేవలు అందించినందుకుగాను భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ, స్నూకర్ ఆటగాడు పంకజ్ అద్వానీలను పద్మభూషణ్ అవార్డు వరించింది. పద్మ అవార్డుల్లో తన పేరు ప్రకటించడంపై ధోనీ ఆనందం వ్యక్తం చేశారు.
విషయం తెలుసుకున్న క్రీడాభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయన్ని అభినందించారు. విశిష్ట సేవలందించిన వారిని కేంద్రం ఎప్పటికైనా గుర్తిస్తుందని, అవార్డులతో సత్కరిస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక పద్మశ్రీ అవార్డులు వరించిన వారిలో బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్, వెయిట్ లిఫ్టర్ సాయ్కోమ్ మీరాబాయ్ చాను, టెన్నిస్ ఆటగాడు సోమ్దేవ్ దేవర్మన్ లతోపాటు భారత తొలి పారాలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ మురళీకాంత్ పేట్కర్ ఉన్నారు.