క్రికెట్ పుట్టి ఎన్నో ఏళ్లు దాటిపోయింది. ఆరంభంలో ఉన్న రూల్స్లో ఇప్పటికి చాలా నిబంధనలు వచ్చాయి. ముఖ్యంగా వర్షం వంటి వాతావరణం వల్ల మ్యాచులు ఆగిపోతే దాన్ని ఎలా ఫేస్ చేయాలి? అనే విషయంలో ఐసీసీ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది. ప్రస్తుతం అయితే డీఎల్ఎస్ విధానం, రిజర్వ్ డే వంటి వాటిని ఇలాంటి పరిస్థితుల్లో ఉపయోగిస్తారు.
అదే కనుక మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్, బౌల్ అవుట్ వంటి వాటిని ఉపయోగించి విజేతను నిర్ణయిస్తారు. అయితే ఇలా ఎన్ని చేసినా ప్రేక్షకులకు ఫుల్ మ్యాచ్ చూసిన మజా ఉండదు కదా. అందుకే సాధ్యమైనంత వరకు మ్యాచ్ జరిగేలా చర్యలు తీసుకుంటారు. అలాంటిది ఇలాంటి మోడ్రన్ కాలంలో కూడా కేవలం టాస్ వేసి విజేతను నిర్ణయిస్తారంటే? నమ్మగలమా? కానీ అదే జరుగుతోంది.

ప్రపంచ క్రికెట్లో ఐపీఎల్ చూసిన సక్సెస్ మరే లీగ్ చూడలేదు. ఈ లీగ్ను చూసిన చాలా దేశాలు తమకు కూడా ఇలాంటి లీగ్ ఒకటి ఉంటే బాగుంటుందని అనుకుంటూ ఉన్నాయి. దానికితోడు ఇలాంటి లీగుల వల్ల భారీగా ఆర్థిక లాభం కూడా ఉంటోంది. దీంతో స్పాన్సర్లు కూడా చాలా ఈజీగా దొరుకుతున్నారు. దీంతో చిన్న దేశాలు కూడా లీగులు మొదలు పెట్టేస్తున్నాయి.
ఈ క్రమంలోనే బెర్ముడాలో కూడా నాకప్ లీగ్ మొదలు పెట్టారు. అయితే ప్రస్తుతం అక్కడ బాగా వర్షాలు పడుతున్నాయి. దీంతో ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దయితే విజేతను ఎలా నిర్ణయిస్తారని? ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేశారు. దీనికి బదులిచ్చిన బెర్ముడా క్రికెట్ బోర్డు షాకింగ్ సొల్యూషన్ చెప్పింది. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే ఇద్దరు కెప్టెన్లతో టాస్ వేయిస్తామని, టాస్ గెలిచిన జట్టును విజేతగా ప్రకటిస్తామని చెప్పింది. ఇది విన్న ఫ్యాన్స్ షాకవుతున్నారు.
'ఇక్కడ ఇటీవల బాగా వర్షాలు పడుతున్నాయి. ఒకవేళ వర్షం పడి ఏదైనా మ్యాచ్ రద్దయితే కాయిన్ టాస్ ద్వారా విజేతను నిర్ణయిస్తాం. హోం టీం కెప్టెన్ టాస్ వేస్తాడు. ఎవే టీం కెప్టెన్ హెడ్స్ లేదా టేల్స్ ఎంచుకుంటాడు. ఈ తతంగం మొత్తాన్ని బెర్ముడా క్రికెట్ అంపైర్స్ అసోసియేషన్ పర్యవేక్షిస్తుంది. వర్షం లేదా మరేదైనా వాతావరణ పరిస్థితుల వల్ల మ్యాచ్ రద్దయితే ఇలా హ్యాండిత్ చేయబోతున్నాం' అని బెర్ముడా క్రికెట్ బోర్డు చైర్మన్ వెల్లడించాడు.