
హైదరాబాద్: భారత్తో ఆడాలన్నది తన కలని, త్వరలో జరగబోయే ఆసియా కప్ ద్వారా ఆ కల నెరవేరే అవకాశం దక్కిందని అంటున్నాడు పాక్ క్రికెటర్ ఇమామ్ ఉల్ హాక్. ఈ ఏడాది జూన్లో వన్డేల్లో అరంగేట్రం చేసిన ఇమామ్ చక్కగా రాణిస్తున్నాడు. ఇప్పటి వరకు 9 వన్డేలు ఆడిన అతడు 68సగటుతో 544 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. గతేడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్పైనే సెంచరీ సాధించాడు.
తాజాగా ఇమామ్ ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...'భారత్తో ఆడాలన్నది నా కల. దీని గురించి ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాను. క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పటి నుంచి భారత్పై ఆడాలి, ఆ మ్యాచ్లో సహచర ఆటగాళ్ల కంటే ప్రత్యేకంగా ఏదైనా చేయాలని అనుకుంటూ ఉంటాను. నేను ఒక్కడినే కాదు మిగతా ఆటగాళ్లైనా ఇలాగే ఆలోచిస్తారు. త్వరలో జరగబోయే ఆసియా కప్ ద్వారా నా కల నెరవేరబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ టోర్నీ కోసం అందరం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ప్రతి మ్యాచ్ గెలుచుకుంటూ వెళ్లి ట్రోఫీని సొంతం చేసుకుంటాం' అని ఇమామ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
'టీమిండియా మొత్తం విరాట్ కోహ్లీ పైనే ఆధారపడుతోంది. భారత్ను అగ్రశ్రేణి జట్టుగా నిలిపేందుకు కోహ్లీ ఒక్కడే చాలా కష్టపడ్డాడు. జట్టులో అతను లేకపోతే సగం జట్టు లేనట్టే. అగ్రశ్రేణి జట్లల్లో భారత్ ఒకటి. ఏదైనా మ్యాచ్లో మనం కోహ్లీని ఔట్ చేస్తే చాలు ఆ జట్టు పని సగం అయిపోయినట్లే. ఈ మ్యాచ్పై అందరికీ భారీ అంచనాలుంటాయి. వాటిని చేరేందుకు ప్రయత్నిస్తాం' అని పేర్కొన్నాడు.
కొన్నేళ్లుగా భారత్-ఇండియా జట్లు తలపడిందే లేదు. అలాంటిది వచ్చే నెల జరగనున్న ఆసియా కప్ ఈవెంట్లో సెప్టెంబర్ 19న భారత్-పాక్ వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ ఆసియా కప్ షెడ్యూల్పై బీసీసీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. పాక్తో జరగనున్న కీలక మ్యాచ్కు ఆటగాళ్లకు విశ్రాంతి లేకుండా ఎలా ఆడతారంటూ ప్రశ్నించింది.