
హైదరాబాద్: ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్తో ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత టాపార్డర్ విఫలమైనప్పటికీ, కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 200కిపైగా పరుగులు సాధించిన సంగతి తెలిసిందే.
కచ్చితంగా గెలుస్తుందని అనుకున్న మ్యాచ్లో భారత బ్యాట్స్మెన్ విఫలం కాగా, ఇంగ్లాండ్ బౌలర్లు చెలరేగడంతో కోహ్లీసేన 31 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలి ఇన్నింగ్స్లో 149 పరుగులు చేసిన కోహ్లి.. రెండో ఇన్నింగ్స్లో 51 పరుగులు చేశాడు.
అయితే.. రెండో టెస్టులో కోహ్లీపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని ఇంగ్లాండ్ కోచ్ ట్రేవర్ వెల్లడించాడు. ఇరు జట్ల మధ్య లార్డ్స్ వేదికగా గురువారం (ఆగస్టు 9) నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండో టెస్టులో మిగతా బ్యాట్స్మెన్లను వేగంగా ఔట్ చేసి కోహ్లీపై ఒత్తిడి పెంచాలని ఇంగ్లాండ్ వ్యూహం రచిస్తున్నట్లు వెల్లడించాడు.
ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టు కోచ్ ట్రేవర్ బేలిస్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ "విరాట్ కోహ్లి బెస్ట్ బ్యాట్స్మెన్ కాకుండా ఉండింటే.. ఇప్పటికే అతడ్ని ఒత్తిడిలోకి నెట్టేవాళ్లం. తొలి టెస్టు.. రెండు ఇన్నింగ్స్ల్లోనూ అతను ఆడిన ఆట అద్భుతం. ఇకపై భారత జట్టులోని టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లను వేగంగా ఔట్ చేయడం ద్వారా సిరీస్లో కోహ్లీపై ఒత్తిడి పెంచుతాం" అని అన్నాడు.
"తొలి టెస్టుకి ఆథిత్యమిచ్చిన బర్మింగ్హామ్ పిచ్ బ్యాట్స్మెన్లను పరీక్షించింది. విరాట్ కోహ్లీ కూడా ఆరంభంలో కొంచెం తడబడ్డాడు. రెండో టెస్టులో ఆఫ్ స్పిన్ ఆడటంపై జాగ్రత్త వహిస్తాం" అని ట్రేవర్ వెల్లడించాడు.