తొలి మ్యాచ్లో అఫ్గానిస్థాన్పై ఘన విజయం సాధించిన భారత్ ఇండోర్ వేదికగా ఇవాళ రెండో మ్యాచ్ ఆడనుంది. ఈ పోరులోనూ గెలిచి సిరీస్ను సాధించాలని టీమిండియా పట్టుదలతో బరిలోకి దిగుతోంది. అయితే ఈ మ్యాచ్లో అందరి దృష్టి విరాట్ కోహ్లిపైనే ఉంది. 14 నెలల తర్వాత విరాట్ తిరిగి టీ20 జట్టులో చేరడంతో సర్వత్రా ఆసక్తిగా మారింది. తొలి మ్యాచ్లోనే కోహ్లి ఆడాల్సి ఉంది. కానీ వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు.
అయితే విరాట్ కోహ్లిని ఓపెనర్గా పంపాలని టీమిండియా మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.జూన్లో జరగనున్న టీ20 ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకొని సన్నద్ధమవ్వాలని సూచిస్తున్నారు. ఆతిథ్యం ఇచ్చే అమెరికా, వెస్టిండీస్ పిచ్లను బట్టి జట్టుకూర్పు గురించి ఆలోచించాలని మాజీ క్రికెటర్లు ఆకాశ్ చోప్రా, పార్థివ్ పటేల్ అంటున్నారు.

''ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్లో కోహ్లి స్టైల్ను పరిశీలించండి. పరిస్థితులకు తగ్గట్టుగా పరుగుల వరద పారించాడు.టీ20ల్లోనూ అదే రీతిలో ఆడతాడు. తొలి బంతికే ఫోర్లు, సిక్సర్లతో కాకుండా అతడు సమయాన్ని తీసుకుంటాడు. పవర్ప్లేలో అయితే 150 స్ట్రైక్ రేట్తో సత్తాచాటుతాడు. న్యూయార్క్, వెస్టిండీస్ పిచ్లపై తొలి ఆరు ఓవర్లలో ఎక్కువగా పరుగులు చేసే అవకాశం ఉంటుంది. రోహిత్, కోహ్లితో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తే అఫ్గానిస్థాన్ సిరీస్లోనే దాన్ని ప్రయోగించాలి'' అని ఆకాశ్ చోప్రా అన్నాడు.

''ఓపెనర్గా కోహ్లి గతంలో సత్తాచాటాడు. టీమిండియా తరపున ఓపెనర్గా వచ్చి గొప్పగానే పరుగులు చేశాడు. అతడు ఇన్నింగ్స్ టోన్ను సెట్ చేయగలడు.అతడికి 120 బంతులు ఎదుర్కొనే అవకాశం వస్తే.. భారీ స్కోరు సాధిస్తాడు'' అని పార్థివ్ పటేల్ అన్నాడు. అయితే పటేల్ అభిప్రాయాన్ని సబా కరీమ్ వ్యతిరేకించాడు. వెస్టిండీస్ స్లో పిచ్లపై జట్టుకు వెన్నెముక నిలబడే ప్లేయర్ కావాలని, కోహ్లి మూడోస్థానంలోనే రావాలని కరీమ్ అన్నాడు.

''కోహ్లి మూడో స్థానంలో ఆడాలని భావిస్తున్నా. వెస్టిండీస్, అమెరికాలో టీ20 ప్రపంచకప్ జరుగుతుంది. విండీస్లోని స్లో వికెట్లపై భారత్ సూపర్-8 మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. అలాంటి సందర్భంలో ఇన్నింగ్స్ను కంట్రోల్ చేసే ఆటగాడు జట్టుకు అవసరం అవుతాడు. కాబట్టి కోహ్లిని మూడో స్థానంలోనే ఆడించేలా రోహిత్ కూడా భావిస్తాడు'' అని కరీమ్ పేర్కొన్నాడు.