Asia Cup 2025: ఆసియా కప్ 2025 జట్టులో శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్ వంటి ఆటగాళ్లను ఎంపిక చేయకపోవడం ప్రకంపనలు సృష్టిస్తోంది. కేవలం భారత్లోనే కాకుండా పాకిస్థాన్లో కూడా దీని గురించి చర్చిస్తున్నారు. ఆసియా కప్ జట్టు నుంచి నుంచి శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ వంటడి ఆటగాళ్లను తప్పించడంపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శ్రేయస్ అయ్యర్కు అన్యాయం జరిగిందని.. ఈ ఆటగాళ్లు పాకిస్థాన్లో ఉండుంటే వారికి ఉన్నత స్థాయి గౌరవం దక్కేదని ఆయన అన్నారు.
అయ్యర్కు అన్యాయం
ఆసియా కప్ కోసం భారత్ ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీలకు చోటు దక్కకపోవడంపై బాసిత్ అలీ తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025లో శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా రాణించాడు. 17 మ్యాచ్లలో 50.33 సగటు, 175.07 స్ట్రైక్ రేట్తో 604 పరుగులు చేసి ఈ సీజన్లో ఆరో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు. అయినప్పటికీ శ్రేయస్ అయ్యర్కు జట్టులో చోటుదక్కకపోవడం గమనార్హం.

కమ్రాన్ అక్మల్తో కలిసి ఓ యూట్యూబ్ షోలో బాసిత్ అలీ మాట్లాడుతూ.."శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ పాకిస్థాన్లో ఉండుంటే వారు 'ఏ' కేటగిరీలో ఉండేవారు" అని అన్నారు. "అయ్యర్కు అన్యాయం జరిగింది. అతను జట్టులో ఉండాల్సింది" అని బాసిత్ అలీ అన్నారు.
భారత్కు శ్రీలంక మాత్రమే పోటీ
భారత్కు ఏ జట్టు గట్టి పోటీ ఇస్తుందో కూడా బాసిత్ అలీ పేర్కొన్నారు. ఈ విషయంలో పాకిస్థాన్ పేరు చెప్పకుండా శ్రీలంకను పేర్కొనడం విశేషం. "భారత జట్టు చాలా పటిష్టంగా ఉంది, వారికి శ్రీలంక మాత్రమే పోటీ ఇవ్వగలదు" అని ఆయన అన్నారు.
ఆసియా కప్లో భారత్ తమ మొదటి మ్యాచ్ను సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 14న పాకిస్తాన్తో హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ రెండు మ్యాచ్లు దుబాయ్లో జరుగుతాయి. ఆ తర్వాత భారత్ తన చివరి లీగ్ మ్యాచ్ను సెప్టెంబర్ 19న అబుదాబిలో ఒమన్తో ఆడనుంది.