అనిశ్చితి ఈజ్ ఈక్వల్ టు పాక్
బలమైన దక్షిణాఫ్రికా జట్టుపై పాకిస్తాన్ అద్భుత ఆటతీరును ప్రదర్శించింది. అటు బ్యాటుతో, ఇటు బంతితో రాణించింది. 300లకు పైగా స్కోర్ చేసింది. ప్రత్యర్థిని 250 ప్లస్ స్కోరుకే పరిమితం చేసింది. కాలర్ ఎగురవేసి మరీ విమర్శలకు నోళ్లను మూయించింది సర్ఫరాజ్ అండ్ టీమ్. ఈ రెండు మ్యాచ్లను బట్టి పాకిస్తాన్ ఆటతీరును అంచనా వేయవచ్చు. పాకిస్తాన్ క్రికెట్ టీమ్ వైఖరి ఎవరి అంచనాలకు అందదనే విషయాన్ని మరోమారు ఈ విజయంతో స్పష్టమైంది. ప్రపంచకప్ వంటి మెగా టోర్నమెంట్లలో విజయాలను సాధించడానికి కేవలం అదృష్టం మీదే ఆధారపడి ఉంటుందనే విమర్శలుక సమాధానం ఇచ్చిందా జట్టు.
1992లో పాకిస్తాన్ టీమ్ ప్రస్థానం ఇలా..
1992 నాటి ప్రపంచకప్లో పాకిస్తాన్ విజయ ప్రస్థానాన్ని గమనిస్తే.. లింక్ ఉందనే అనుకోవాలి. ఆ లింక్ ఇప్పుడు కూడా కొనసాగుతోందనే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే- 1992 పాకిస్తాన్ ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి గెలుపోటములను ఎదుర్కొన్నదో.. ఇప్పుడూ అవే కళ్లముందు సాక్షాత్కరించాయి. అప్పుడు ఆ జట్టుకు ఇమ్రాన్ ఖాన్ కేప్టెన్గా ఉన్నారు. 1992లో ఓటమితో తన ప్రపంచకప్ ప్రస్థానాన్ని ప్రారంభించింది పాకిస్తాన్ టీమ్. రెండో మ్యాచ్లో విజయం సాధించింది. ఆ టోర్నీలో పాక్ ఆడిన తొలి మ్యాచ్ వెస్టిండీస్పై. ఆ మ్యాచ్లో ఘోర ఓటమిని చవిచూసింది. ఆ తర్వాత జింబాబ్వేతో జరిగిన రెండో మ్యాచ్లో విజయం సాధించింది. మూడో మ్యాచ్ రద్దయింది. నాలుగు, అయిదు మ్యాచ్లల్లో కూడా పాకిస్తాన్ పరాజయం పాలైంది. ఆరో మ్యాచ్లో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ఏడు, ఎనిమిది మ్యాచ్లల్లో వరుస విజయాలను సాధించింది. సెమీ ఫైనల్లో న్యూజీలాండ్ జట్టును చిత్తు చేసింది. ఫైనల్లో ఇంగ్లండ్ను ఓడించి కప్పును ఎగరేసుకెళ్లింది. ఆ జట్టుకు నాయకత్వం వహించిన ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం పాకిస్తాన్కు ప్రధానమంత్రి అయ్యారు.
2019లో పాకిస్తాన్ టీమ్ ప్రస్థానమూ ఇంతే..
ప్రస్తుత ప్రపంచకప్ను కూడా ఓటమితో తన ప్రస్థానాన్ని ఆరంభించింది సర్ఫరాజ్ టీమ్. రెండో మ్యాచ్లో విజయం సాధించింది. ప్రస్తుత టోర్నమెంట్లో కూడా పాకిస్తాన్ తొలి ప్రత్యర్థి వెస్టిండీసే కావడం గమనార్హం. ఈ మ్యాచ్లో ఘోర ఓటమిని చవిచూసింది. 105 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత ఇంగ్లండ్తో జరిగిన రెండో మ్యాచ్లో విజయం సాధించింది. 1992 తరహాలోనే శ్రీలంకతో జరగాల్సిన మూడో మ్యాచ్ ఇక్కడా రద్దయింది. నాలుగో మ్యాచ్లో ఆస్ట్రేలియాతో, అయిదో మ్యాచ్లో టీమిండియాతో ఆడిన పాకిస్తాన్ పరాజయం పాలైంది. ఆరో మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయాన్ని నమోదు చేసింది. ఇక వెనుదిరిగి చూసుకోలేదు. 1992లో పాకిస్తాన్ ప్రస్థానం ఎలా కొనసాగిందో.. దానికి ప్రతిబింబాన్నే ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా ఉంది. ఆరు మ్యాచ్ల వరకూ అచ్చు గుద్దినట్టు చరిత్ర పునరావృతమైంది. ఇక మిగిలిన మ్యాచులు ఎలా సాగుతాయనేది వేచి చూడాల్సిందే.
కప్ గెలుస్తుందా? సర్ఫరాజ్ కూడా ప్రధాని అవుతారా?
తన ఏడో మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు న్యూజీలాండ్తో తలపడుతోంది. వరుసగా మ్యాచ్లను గెలుచుకుని ఫైనల్కు వెళ్తుందా? అనే చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది. పాకిస్తాన్ సెమీస్కు చేరుకోగలిగితే.. ఇక ఆ జట్టుకు ఎదురు ఉండదని, కప్పును ఎగరేసుకుని పోవడం ఖాయమని జోస్యం చెబుతున్నారు నెటిజన్లు, ట్విట్టరెట్టీలు. 1992 నాటి ప్రపంచకప్ను అందుకున్న ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం పాకిస్తాన్ ప్రధానమంత్రి అయినట్టే.. ఇప్పుడు సర్ఫరాజ్ అహ్మద్ ప్రపంచకప్ను సాధిస్తే.. ఇమ్రాన్ ఖాన్ బాటలో నడుస్తాడనీ అంటున్నారు.