ముంబై: మహేంద్ర సింగ్ ధోనీ గురించి షాకింగ్ విషయం చెప్పిన మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సచిన్ టెండుల్కర్ రిటైర్ కాకుంటే తామే అతనిని వన్డేల నుంచి తొలగించేవాళ్లమని చెప్పాడు.
సెలక్షన్ కమిటీ చైర్మన్ పోయిన తర్వాత సందీప్ పాటిల్ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ధోనీ కెప్టెన్సీ పైన, ఆ తర్వాత సచిన్ పైన ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
సచిన్ గురించి మాట్లాడుతూ... మాస్టర్ బ్లాస్టర్ తన రిటైర్మెంటును ప్రకటించకుంటే తామే తీసేయాలన్న నిర్ణయానికి వచ్చామని షాకింగ్ విషయం చెప్పాడు. మరాఠీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పై వ్యాఖ్యలు చేశాడు.
డిసెంబర్ 12, 2012న తాము సచిన్ను కలసి.. నీ భవిష్యత్ ప్లాన్ ఏమిటని అడిగామని, తన మనసులో రిటైర్మెంట్ ఆలోచన లేదని చెప్పాడని, కానీ అప్పట్లో సెలక్షన్ కమిటీ సచిన్ను తొలగించాలన్న నిర్ణయానికే వచ్చిందని అన్నాడు.
ఇదే విషయాన్ని సచిన్కు చెప్పామని, తమ ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న సచిన్.. తదుపరి సమావేశం జరిగే లోగానే వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడని, అతను అలా చేయకుంటే తాము కచ్చితంగా తొలగించి ఉండేవాళ్లమని చెప్పాడు. సచిన్ రిటైర్మెంట్ పైన దాదాపు రెండేళ్లు తర్జన భర్జనలు జరిగాయన్నాడు. కాగా, డిసెంబర్ 23, 2012న సచిన్ తన రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.