
హైదరాబాద్: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మ్యాచ్ విజేత అయితే, అతడిని మీరు ఎందుకు అడించడం లేదంటూ మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కెప్టెన్ కోహ్లీతో పాటు జట్టు మేనేజ్మెంట్ని ప్రశ్నించాడు. రిషభ్ పంత్ను పక్కను పెట్టి మ్యాచ్లు ఆడించడాన్ని సెహ్వాగ్ ప్రశ్నించాడు.
సెహ్వాగ్ మాట్లాడుతూ "రిషబ్ పంత్ను రిజర్వ్ ఆటగాడిగా పరిమితం చేస్తే పరుగులు ఎలా చేస్తాడు. సచిన్ టెండూల్కర్ను రిజర్వ్ బెంచ్లో కూర్చోబెడితే పరుగులు చేయగలడా? పంత్ మ్యాచ్ విజేత అయితే, అతడిని మీరు ఎందుకు అడించడం లేదు. అతడు నిలకడగా రాణించని కారణంగానా?" అని ప్రశ్నించాడు.
"ఈ సమయంలో ఒక కెప్టెన్గా విరాట్ కోహ్లీ... పంత్తో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ధోనిని ఫాలో అవుతున్నాడో.. లేదో నాకు తెలీదు. జట్టు కూర్పులో నా పాత్ర కూడా ఏమీ ఉండదు. ఆసియా కప్కు రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరించిన సమయంలో అందరితో మాట్లాడాడు. ఇప్పుడు కోహ్లి అలా చేస్తాన్నాడో.. లేదో నాకైతే కచ్చితంగా తెలీదు" అని సెహ్వాగ్ అన్నాడు.
"గతంలో ధోని కెప్టెన్సీలో మమ్మల్ని సంప్రదించకుండానే రొటేషన్ పద్ధతి గురించి బహిరంగంగా ప్రకటన చేశాడు. మేము మీడియా ద్వారానే ఆ విషయం తెలుసుకున్నాం. ఇప్పుడు కోహ్లి కూడా అలానే చేస్తున్నాడా? ఒకవేళ అలానే చేస్తే అది తప్పే" అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. కివీస్తో సిరీస్కు ముందు ఆసీస్తో జరిగిన మూడు వన్డేల సిరిస్లో పంత్ గాయపడ్డాడు.
అతడి స్థానంలో కాంకషన్ కింద వికెట్ కీపర్గా బాధ్యతలు అందుకున్న కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. దీంతో పంత్కు తుది జట్టులో చోటు దక్కడం లేదు. కివీస్ పర్యటనలో ఇప్పటికే నాలుగు టీ20లు ముగిసినా... రిషబ్ పంత్కు అవకాశం ఇవ్వలేదు. సంజూ శాంసన్ను నాలుగో టీ20లో ఆడించినా అతడు నిరాశపరిచిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఐదో టీ20లోనైనా పంత్ను ఆడిస్తారా లేక సంజూ శాంసన్కే మరో అవకాశం ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఐదు టీ20ల సిరిస్లో టీమిండియా ఇప్పటికే నాలుగు టీ20ల్లో విజయం సాధించడంతో 4-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.