రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోసం తాను రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని వెస్టిండీస్ దిగ్గజం, మాజీ ఆర్సీబీ ప్లేయర్ క్రిస్ గేల్ అన్నాడు. శనివారం జరిగిన ఆర్సీబీ-సీఎస్కే మ్యాచ్ను వీక్షించడానికి చిన్నస్వామి స్టేడియానికి వచ్చిన గేల్ ఈ కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టుకు అవసరమైతే ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగుతానని పేర్కొంటూ ఆర్సీబీతో తనకు ఉన్న అనుబంధాన్ని వ్యక్తం చేశాడు.
ప్లేఆఫ్స్కు వెళ్లాలంటే చెన్నై సూపర్ కింగ్స్పై కనీసం 18 పరుగుల తేడాతో గెలవాల్సిన మ్యాచ్లో ఆర్సీబీ అదరగొట్టిన విషయం తెలిసిందే. 27 పరుగుల తేడాతో నెగ్గి ప్లేఆఫ్స్కు చేరింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. డుప్లెసిస్ (54; 39 బంతుల్లో, 3X4, 3X6) టాప్ స్కోరర్.

అనంతరం ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఛేదనలో సీఎస్కే 20 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 191 పరుగులకు పరిమితమైంది. రచిన్ రవీంద్ర (61; 37 బంతుల్లో, 5X4, 3X6), రవీంద్ర జడేజా (42; 22 బంతుల్లో, 3X4, 3X6) పోరాడారు. కాగా, మ్యాచ్ ముగిసిన అనంతరం గేల్ మాట్లాడాడు. కీలక మ్యాచ్ను చూడటం కోసం బెంగళూరు వచ్చినందుకు సంతోషంగా ఉందని తెలిపాడు. ఆర్సీబీ జెర్సీ ధరించి స్టేడియానికి వచ్చిన గేల్ ప్రముఖ హీరో రిషభ్ శెట్టితో కలిసి మ్యాచ్ను వీక్షించాడు.
''నా ఆర్సీబీ జెర్సీని చూశారా ఇంకా ఫిట్గా ఉంది. ఆర్సీబీకి అదనపు ఆటగాడు కావాలంటే చెప్పండి. నేను ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగుతా. ఆర్సీబీ ఫ్యాన్స్ను చూడటం ఎంతో ఆనందంగా ఉంది. ఎల్లప్పుడూ ఆర్సీబీకే నా మద్దతు. ఎప్పటికీ ఆర్సీబీ ఫ్యాన్లానే ఉంటా. ఎన్నో మధుర జ్ణాపకాలకు సాక్ష్యంగా నిలిచిన చోటుకు తిరిగి రావడం సంతోషంగా ఉంది. అంతేగాక కీలక మ్యాచ్కు రావడం ఎంతో బాగుంది''
''చిన్నస్వామి స్టేడియం నాకెంతో స్పెషల్. ఇక్కడో విషయాన్ని గమనించాను. కొత్త రూఫ్ను తీసుకువచ్చారు. గత రూఫ్కు నేను కొంచెం డ్యామేజ్ చేశానుకుంటా. కొత్త రూఫ్కు యూనివర్సల్ బాస్లా ఎవరైనా డెంట్ పెట్టి ఎంటర్టైన్ చేయాలని ఆశిస్తున్నా. క్రికెట్ ఆడేందకు ఇది ఉత్తమమైన ప్రాంతం. వాతావరణం అద్భుతంగా ఉంటుంది. ఆర్సీబీతో ఉన్న నా కెరీర్లో ఫ్యాన్స్ కీలక పాత్ర పోషించారు'' అని గేల్ అన్నాడు.