
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా.. భారత జట్టులో మార్పులు జరగాలని పేర్కొన్నాడు. రవి బిష్ణోయ్ను అవేశ్ ఖాన్ ప్లేస్లో తీసుకోవాలని అభిప్రాయపడ్డాడు. అలా చేస్తే హాంకాంగ్తో జరగబోయే పోరులో అతను ట్రంప్ కార్డ్ కావొచ్చని అభిప్రాయపడ్డాడు. యుఏఈలోని పిచ్లు స్పిన్ బౌలర్లకు అనుకూలంగా ఉన్నందున వారి లైనప్లో అదనపు స్పిన్నర్ ఉండటం భారత జట్టుకు ప్రయోజనం చేకూరుస్తుందని కనేరియా పేర్కొన్నాడు. భారత్లో ఇప్పటికే ముగ్గురు సీమర్లు ఉన్నారని, హార్దిక్ పాండ్యా తన నాలుగు ఓవర్ల పూర్తి కోటాను బౌలింగ్ చేయగలడని కనేరియా పేర్కొన్నాడు.
'రవి బిష్ణోయ్ని జట్టులో ఉంచడం జట్టుకు పెద్ద మార్పును కలిగిస్తుందని నేను భావిస్తున్నాను. అతను టీమిండియాకు నిజమైన ట్రంప్ కార్డ్ కావొచ్చని తెలిపాడు. యూఏఈలోని పరిస్థితులు కూడా అతనికి అనుకూలంగా ఉంటాయి. టీమిండియాలో ఇప్పటికే భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్, హార్దిక్ పాండ్యాతో కలిపి ముగ్గురు పేసర్లు ఉన్నారు. అందువల్ల టీమిండియా మరో స్పిన్నర్ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. అందువల్ల టీమిండియా బౌలింగ్ మరింత బలోపేతం అవుతుంది.' అని డానిష్ కనేరియా తన అధికారిక యూట్యూబ్ ఛానెల్లోని వీడియోలో తెలిపాడు.

రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు తమ ప్లేయింగ్ XIలో చాలా మార్పులు చేస్తుందని ఆశించడం లేదని, అయితే భారత జట్టు మేనేజ్మెంట్ దీపక్ హుడాకు హాంకాంగ్తో మ్యాచ్లో అవకాశం ఇవ్వవచ్చని కనేరియా పేర్కొన్నాడు. రైట్ హ్యాండ్ బ్యాటర్ అయిన దీపక్ హుడా చాలా ఉజ్వల భవిష్యత్తు ఉందని ఆయన అన్నాడు.
ఆసియాకప్లో టీమిండియా పాకిస్థాన్తో ఆదివారం జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్లో 5వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక గ్రూప్ ఏలో ఈ విజయంతో టాప్ పొజిషన్కు చేరిన ఇండియా నేడు రెండో మ్యాచ్ హాంకాంగ్తో తలపడనుంది. క్వాలిఫయర్గా టోర్నీలోకి ఎంట్రీ ఇచ్చిన హాంకాంగ్ ఇటీవల నిలకడ ప్రదర్శన కనబర్చుతుంది. గతంలో ఆసియా కప్లో 2008లో, 2018లో హాంకాంగ్తో ఇండియా తలపడింది. ఆ రెండు సార్లు ఇండియానే గెలిచింది. ఇకపోతే దుబాయ్ స్టేడియం వేదికగా ఇరు జట్లు నేడు రాత్రి 7.30కు బరిలోకి దిగనున్నాయి.