ముంబై: అవకాశం ఇస్తే టెస్టుల్లో ఓపెనింగ్ చేసేందుకు తాను సిద్ధమని ఓపెనర్ రోహిత్ శర్మ అన్నాడు. అయితే ఈ విషయంలో జట్టు మేనేజ్మెంట్ ఎప్పుడూ తనను అడుగలేదని చెప్పాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్లో జరుగుతున్న టెస్టు సిరీస్లో ముగ్గురు ఓపెనర్లు మురళీ విజయ్, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ విఫలమవుతున్న నేపథ్యంలో అవకాశం ఇస్తే ఓపెనింగ్ చేస్తారా అని అడిగిన ప్రశ్నకు రోహిత్ పై సమాధానమిచ్చాడు.
'టెస్టు ఓపెనింగ్ గురించి నాతో మేనేజ్మెంట్ చర్చించలేదు. అలాంటి అవకాశాన్ని కూడా ఇవ్వలేదు. ఒకవేళ మేనేజ్మెంట్ ఆదేశిస్తే నేను రెడీ. నేను ఆట మొదలుపెట్టినప్పుడుగానీ, భారత్కు ఆడుతున్నప్పుడుగానీ వన్డేల్లో ఓపెనింగ్ చేస్తానని ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ ఏదో ఓ దశలో ఇది సాధ్యమైంది. కాబట్టి అవకాశం వస్తే టెస్టు ప్రత్యామ్నాయాలకు కూడా నేను సిద్ధంగా ఉన్నా' అని రోహిత్ పేర్కొన్నాడు.
'విదేశాల్లో తన బ్యాటింగ్ టెక్నిక్పై సందేహాలు వస్తున్నా.. ఐదు రోజుల ఫార్మాట్లో కచ్చితంగా పిలుపు వస్తుందని రోహిత్ ఆశాభావం వ్యక్తం చేశాడు. టెస్టు జట్టులో భాగస్వామ్యం కావాలని ఉంది. కానీ అది నా చేతుల్లో లేదు. అవకాశం కోసం ఎదురుచూడటం తప్ప చేసేదేమీ లేదు. ఎప్పుడొచ్చినా దానిని సద్వినియోగం చేసుకుంటా' అని వెల్లడించాడు.
ఇంగ్లాండ్ గడ్డపై తొలి రెండు టెస్టుల్లో ఓడిన టీమ్ఇండియాకు రోహిత్ మద్దతుగా నిలిచాడు. దక్షిణాఫ్రికాలోనూ తాము తొలి మ్యాచ్ ఓడిపోయినా తర్వాత రెండు మ్యాచుల్లోనూ రాణించామని గుర్తు చేశాడు. ఇలానే మరో మూడు మ్యాచ్లు మిగిలి ఉన్న ఈ ఇంగ్లాండ్ సిరీస్లో టీమిండియా పుంజుకునే అవకాశాలున్నాయని మద్దతిచ్చాడు. టెస్టు క్రికెట్లో జట్టు మేనేజ్మెంట్ ఓపెనింగ్ చేయమంటే తానెప్పుడూ సిద్ధమేనని రోహిత్ శర్మ అన్నాడు. 25 టెస్టుల్లో 40 ఇన్నింగ్సుల్లో 1479 పరుగులు చేసిన ఈ ముంబై ఆటగాడికి టెస్టుల్లో స్థిరమైన స్థానం లేదు.